ESIC Hospital: తెలంగాణ ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో.. రాష్ట్రంలో మరో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, పెద్ద గోల్కొండ గ్రామంలోని రైకుంటలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన.. ఇటీవల నిర్వహించిన ఈఎస్ఐసీ 197వ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో శంషాబాద్లో నిర్మించబోయే 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రికి అవసరమైన భూసేకరణకు అనుమతి మంజూరైంది. ఇందుకోసం సుమారు రూ. 16.125 కోట్ల వ్యయంతో భూమిని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో రూ.1.32 లక్షలకు పైగా ఈఎస్ఐ ఇన్స్యూరెన్స్ కలిగిన కార్మికులు ఉన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, పారిశ్రామిక పార్కులు, ఐటీ హబ్లు, లాజిస్టిక్స్ కేంద్రాల కారణంగా ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ వేగంగా పెరుగుతోంది. దీనితో రానున్న రోజుల్లో వేల సంఖ్యలో కొత్త కార్మికులు ఈ ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్మికులకు తగిన వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతో కీలకంగా మారింది.
ఈ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, శంషాబాద్లోనే పూర్తిస్థాయి 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరగనుంది. అంతేకాదు, నిర్మాణం పూర్తయ్యాక ఆసుపత్రి నిర్వహణ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. దీని ద్వారా కార్మికులకు నిరంతర, నమ్మకమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్లోని సనత్నగర్ ప్రాంతంలో ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.. కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తోంది. అలాగే నాచారం, రామచంద్రాపురం, సిర్పూర్ కాగజ్నగర్, వరంగల్ వంటి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈఎస్ఐ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో శంషాబాద్ కూడా చేరనుంది.
ఈ కొత్త ఆసుపత్రి వల్ల కార్మికులు చిన్నచిన్న వైద్య అవసరాల కోసం.. దూరప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. అత్యవసర వైద్య సేవలు, సాధారణ చికిత్సలు, కుటుంబ సభ్యులకు అవసరమైన ఆరోగ్య సేవలు అన్నీ ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా కార్మికుల ఆరోగ్య భద్రత మెరుగుపడడమే కాకుండా, వారి ఆర్థిక భారమూ తగ్గే అవకాశం ఉంది.
Also Read: GHMC డీలిమిటేషన్పై కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టీకరణ.. అభ్యంతరాలన్నీ పరిగణలోకి తీసుకుంటాం..!
ఈ కీలక నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని శంషాబాద్లో ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలపడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.