Minister Lokesh In Russia: మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా రష్యా దేశ ప్రభుత్వ నియంత్రణలో రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్ బ్యాంక్ ఉపాధ్యక్షుడితో ఆయన భేటీ అయ్యారు. భారత్లో బ్యాంకింగ్, టెక్నాలజీ, స్మార్ట్ సిటీ రంగాలలో సహకారానికి సంబంధించి పలు ప్రతిపాదనలు చేశారు.
రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్తో భేటీ
ఏపీ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా మాస్కోలో రష్యా ప్రభుత్వ నియంత్రణలోవున్న రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు ఆల్బర్ట్ యెఫిమోవ్తో భేటీ అయ్యారు. బ్యాంకింగ్, టెక్నాలజీ, స్మార్ట్ సిటీ రంగాలలో సహకారానికి సంబంధించి పలు ప్రతిపాదనలు మంత్రి చేశారు.
స్బేర్ బ్యాంక్ అభివృద్ధి చేసిన గిగాచాట్ ఎల్ఎల్ఎంను భారత బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు విస్తరించాలని ఈ సందర్భంగా ఆయన్ని కోరారు. పాశ్చాత్య ప్లాట్ ఫారమ్లకు ఇదొక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందన్నారు.
గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ పై కీలక ప్రతిపాదనలు
మనీ ట్రాన్సఫర్ భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు అత్యాధునిక వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్ ఇంటిగ్రేట్ చేయడానికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా మున్సిపల్ కార్యకలాపాలను మెరుగు పరచడానికి స్బేర్ బ్యాంక్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్ వంటి డిజిటల్ పరిష్కారాలను అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్, ఏఐ ఇంజనీర్లను వేగంగా తీర్చిదిద్దేందుకు స్బేర్బ్యాంక్ ప్రత్యేక శిక్షణా విధానం స్కూల్ 21 కోడింగ్ అకాడమీలను భారత్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల సౌలభ్యం కోసం రూపాయి-రూబుల్ వాణిజ్యానికి అనుమతితోపాటు వ్యవస్థీకృత రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ALSO READ: ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. కూటమిని అడిగి పారేసిన రాచమల్లు
స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించారు. భారత్లో తమ కార్యకలాపాలను న్యూఢిల్లీలోని కార్యాలయం ద్వారా వాణిజ్య ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. బెంగళూరులోని రూపాయి-రూబుల్ వాణిజ్య లావాదేవీలకు సమన్వయ కేంద్రంగా పని చేస్తోందని, న్యూఢిల్లీ-ముంబై నగరాల్లో తమ శాఖలు వ్యూహాత్మక వాణిజ్య కారిడార్లలో మౌలిక సదుపాయాల పెట్టుబడులకు గేట్వేలుగా ఉన్నాయని వివరించారు. లోకేష్ ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని యెఫిమోవ్ హామీ ఇచ్చారు.