Yash Property: యష్..KGFసిరీస్ తో సత్తా చాటిన ఈ కన్నడ రాకింగ్ స్టార్ ఇపుడు వెండితెరపైనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసే పనిలో పడ్డాడు.విషయంలోకి వెళ్తే ప్రస్తుతం బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో రావణాసురుడిగా నటిస్తున్న యష్.. మరోవైపు గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో లీడ్ రోల్ చేస్తున్న ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నసంగతి తెల్సిందే.ఇక ఈ గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ ‘టాక్సిక్’ వాస్తవానికి 2026 ఏప్రిల్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత 2026 జూన్ 4వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రమోషనల్ అప్డేట్ లేదా టీజర్ సౌండ్ లేకపోవడంతో ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ మరోసారి వాయిదా పడినట్లు స్పష్టమవుతోంది. ఇలా ఒకవైపు సినిమాల లైనప్ ఇలా ఉండగానే, రాకింగ్ స్టార్ యష్ తన సతీమణి రాధిక పండిట్తో కలిసి బిజినెస్ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అలీబాగ్లో భారీ స్థాయిలో ల్యాండ్ ఇన్వెస్ట్ మెంట్
సినీ పరిశ్రమలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, యష్ దంపతులు ముంబైకి సమీపంలో ఉన్న మహారాష్ట్రలోని ప్రముఖ తీర ప్రాంత పర్యాటక కేంద్రమైన అలీబాగ్లో భారీ స్థాయిలో ల్యాండ్ ఇన్వెస్ట్ మెంట్ చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘లియాసెస్ ఫోరాస్’ వెల్లడించిన అఫీషియల్ స్టాట్స్ ప్రకారం.. అలీబాగ్ తాలూకా పరిధిలోని కమత్ గ్రామంలో సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఉన్న ఒక భారీ ల్యాండ్ను ఈ జంట సొంతం చేసుకుంది.
దాదాపు 24 కోట్ల రూపాయల భారీ మొత్తంతో ఈ లగ్జరీ ప్రాపర్టీ డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ నెలకు సంబంధించిన 18వ తేదీన అలీబాగ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సీక్రెట్ గా ముగిసింది. మొత్తం 5,289 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రెండు అనుబంధ వ్యవసాయ భూములు ఈ రియల్ ఎస్టేట్ డీల్లో భాగమ్యాయి. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఆ స్థలంలో ఇప్పటికే ఒక లగ్జరీ హౌస్ కూడా ఉంది. అయితే యష్-రాధిక దంపతులు ఈ స్థలాన్ని తమ వ్యక్తిగత హాలిడే హోమ్ లేదా ఫామ్హౌస్ నిర్మించుకోవడానికి కొనుగోలు చేశారా, లేక భవిష్యత్తులో కమర్షియల్ రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభించడానికి ఇన్వెస్ట్ చేశారా అనే దానిపై ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తుంది.
అలీబాగ్ ప్రాంతం ఒక లగ్జరీ హాట్స్పాట్
గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరోలు, పారిశ్రామికవేత్తలకు ఈ అలీబాగ్ ప్రాంతం ఒక లగ్జరీ హాట్స్పాట్గా మారిపోయింది. ముంబై మహానగరానికి అత్యంత దగ్గరగా ఉండటంతో పాటు, ప్రశాంతమైన కొంకణ్ తీర ప్రాంత వాతావరణం ఉండటం వల్ల సెలబ్రిటీలు ఇక్కడ వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇప్పటికే కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, పవర్ఫుల్ కపుల్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ లాంటి ఎందరో ప్రముఖులకు అలీబాగ్లో లగ్జరీ విల్లాలు ఉన్నాయి.
ఇప్పుడు ఆ క్లబ్లోకి కన్నడ ఇండస్ట్రీ నుంచి యష్ చేరడం విశేషం. సినిమాల విషయానికి వస్తే రణబీర్ కపూర్ హీరోగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో యష్ పోషిస్తున్న రావణుడి పాత్రపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మైథలాజికల్ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా, మొదటి భాగం 2026 చివరి నాటికి థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి వెండితెరపై రావణుడిగా, టాక్సిక్ గ్యాంగ్స్టర్గా అలరించబోతున్న యష్, రియల్ ఎస్టేట్ బిజినెస్లోనూ తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడన్న మాట.