AP Politics: ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడుల వేట కంటిన్యూ చేస్తోంది. తాజాగా మంత్రి లోకేష్ ఫారెన్ టూర్ ఖరారు అయ్యింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ ఫస్ట్ వీక్లో అమెరికా వెళ్లి, వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ సమావేశాలకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఎన్ఆర్ఐ నేతలు కీలక పాత్ర పోషించనున్నారు.
పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా టూర్
ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించేందుకు చంద్రబాబు సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి చకచకా అడుగులు వేస్తోంది. నవంబర్లో విశాఖ వేదికగా రెండురోజులపాటు సీఐఐ సదస్సు జరిగింది. వివిధ కంపెనీలతో భారీగా ఎంవోయూలు కుదుర్చుకుంది ప్రభుత్వం. ఆ ఒప్పందాలు అమలైతే 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నది ప్రభుత్వం మాట.
ఓవైపు నుంచి ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలతో అధికారులు మంతనాలు జరుపుతున్నారు. తాజాగా మంత్రి లోకేష్ అమెరికా టూర్ ఓకే అయ్యింది. వచ్చేనెల అనగా డిసెంబర్ ఆరున ఆయన యూఎస్ లో పర్యటించనున్నారు. వారం రోజుల టూర్లో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీనికి సంబంధించి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
డిసెంబర్ ఫస్ట్ వీక్లో, తెలుగువారితో సమావేశాలు
డిసెంబర్ ఆరున ఏపీ నుంచి అమెరికా వెళ్లనున్నారు మంత్రి లోకేష్. తొలుత డల్లాస్కు చేరుకుంటారు. అక్కడ ‘తెలుగు కమ్యూనిటీ విత్ నారా లోకేష్’ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టెక్సాస్, ఒక్లహోమా, లూసియానా, ఆర్కాన్సాస్ రాష్ట్రాల తెలుగువారు హాజరుకానున్నారు.
ఆ తర్వాత 8 వేల మందితో గార్లాండ్లో భారీ సభ నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 8, 9 తేదీల్లో శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. టెక్, ఐటీ రంగాల్లో ఏపీలో ఉన్న అవకాశాలపై వివరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, రాష్ట్ర పురోగతి లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి, తిరుమల శ్రీవారి సారె
లోకేష్ టూర్లో సమావేశాల వెనుక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఎన్నారై విభాగాలు కీలక పాత్ర పోషించనున్నాయి. గతంలో అమెరికా వెళ్లిన మంత్రి లోకేష్.. గూగుల్ కంపెనీ ప్రతినిధులతో మంతనాలు జరిపారు. విశాఖలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకొచ్చింది.
ఈసారి యువనేత అక్కడికి వెళ్తుండడంతో ఏ పెద్ద కంపెనీ రాబోతోందంటూ చర్చించుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. పెట్టుబడుల పేరిట సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఫారెన్ టూర్లు వెళ్లడంపై వైసీపీ నుంచి కామెంట్స్ పడిపోతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అంటున్నారు ఆ పార్టీ నేతలు.