కొండా సురేఖ బర్తరఫ్ ఎపిసోడ్.. రేవంత్ నాయకత్వాన్ని మరింత బలవంతుడిని చేసింది. రేవంత్ను ఎవరు పడితే వాళ్లు ఇక బెదిరింపు రాజకీయాలకు పాల్పడే చాన్స్ లేకుండా అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నారెడ్డి వ్యాఖ్యలను కూడా లైట్గా తీసుకోలేదు అధిష్టానం. స్వేచ్చ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం.. సీఎంను బెదిరించే రీతిలో మాట్లాడితే చెల్లుబాటవుతుంది.. అనుకున్నది నెరవేరుతుందనే భావన ప్రస్తుత కాంగ్రెస్లో ఇకపై ఉండదనే సంకేతాలిచ్చింది అధిష్టానం.
ఇప్పటికే సర్కార్ కు సగం టర్ము పూర్తయ్యింది. ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నది. హామీలన్నీ అమలు కాలేదనే భావన ప్రజల్లో ఉంది. దీన్ని బలంగా ప్రజలకు చేరేవేసేలా బీఆరెస్ నిరంతరం పోరాడుతున్నది. వెంటాడుతున్నది. ఈ క్రమంలో పాలనపై పట్టు బిగించాల్సిన సమయంలో.. ఇలా అసమ్మతి సెగలతో సీఎం రగలిపోతుంటే.. ప్రతిపక్షాలకు మరింత ఊతమిచ్చినట్టే అవుతుందనే భావన కూడా అధిష్టానంలో ఉంది.
అందుకే బీసీ కార్డు ప్రయోగించినా.. సీనియర్ మహిళా నేతనని ప్రొజెక్టు చేసుకున్నా మరోసారి కొండా విషయంలో దయార్ధ్ర హృదయాన్ని ప్రదర్శించేందుకు ఏమాత్రం ఆలోచించలేదు. సీఎం రేవంత్ ఇచ్చిన రిపోర్టు.. చేసిన సూచనను కఠినంగా అమలు చేసి చూపింది. దీంతో అధిష్టానం వద్ద రేవంత్ బలం ఏపాటితో రాష్ట్ర రాజకీయాలకు సంకేతం ఇచ్చినట్టే కాకుండా.. తమలోని అంతర్గత అసమ్మతివాదులకు గట్టి హెచ్చరికను జారీ చేసినట్టుగా భావించాలి.
ఉన్నది రెండేళ్ల కాలం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేసిన విషయాలను జనంలోకి పెద్దగా తీసుకెళ్లలేకపోయింది పార్టీ. తీవ్ర అసంతృప్తిలో జనాలున్నారనే ప్రచారం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ మరోసారి కాంగ్రెస్ సర్కారే అధికారంలోకి రాబోతున్నదని, నేనే మరోసారి సీఎంగా ఉంటానని ప్రకటించుకుంటున్న వేళ.. అధిష్టానం కూడా ఆయనకు కొండంత అండగా ఉన్నదనే విషయం కొండా సురేఖ ఉదంతంతో బయటపడింది.
పరిపాలనపై ఇక మరింత పట్టు సాధించే దిశగా రేవంత్కు అన్ని రూట్లు క్లియర్ చేసి పెట్టింది అధిష్టానం. మరోసారి అధికారంలోకి రావాలంటే రేవంత్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని అధిష్టానం డిసైడ్ అయ్యింది. ఇకపై అసమ్మతి వాదులు ఎడాపెడా వాగితే తాడోపేడో తేల్చేస్తామని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. బీ కేర్ ఫుల్ అని అలర్ట్ చేస్తోంది. అయినా అలాగే ఉంటామంటే వేటుకు సిద్దంగా ఉండాలని కూడా మెసేజ్ ఇస్తోంది.