Amaravati: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయా? అధికార-విపక్షాల మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయా? ప్రజలను ఆకట్టుకునే పనిలో వైసీపీ నేతలు తమ నోటికి పని చెబుతున్నారా? అధికారంలోకి రాకముందే తమ నైజాన్ని బయటపెడుతున్నారా? వైసీపీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎందుకు చెబుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఏపీలో అధికారం కోల్పోయి వైసీపీకి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ నేతలు యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారు. అంతేకాదు మీడియా ముందు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అధికార పార్టీపై మాటల వేగాన్ని పెంచారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ మాదిరిగా నేతలు తమ నోటికి పని చెబుతున్నారు.
ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి. మా పార్టీ అధినేత జగన్ ఏం చెబితే అది చేస్తామని, ఆత్మహుతి దళంగా పని చేస్తామన్నారు. సదరు నేత మాటలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై టీడీపీ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యింది. మంగళవారం ఉదయం మీడియా ముందుకొచ్చిన మంత్రి పార్థసారధిలో వైసీపీ నేతల మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ విధానాలు పరిశీలిస్తే.. తండ్రి, బాబాయ్ మరణాలను ఆయుధంగా మార్చుకుందని ఆరోపించారు సదరు మంత్రి. ఈ స్థాయికి దిగజారి వైసీపీ రాజకీయాలు చేస్తోందన్నారు. అందుకే నరుకుతాం.. చంపుతాం.. విధ్వంసం చేస్తాం.. అని చెబుతున్నారని అన్నారు. తాము ఆ వైసీపీని గొడ్డలి పార్టీగా చెప్పడం వెనుక ఇదే కారణమన్నారు.
ఉగ్రవాదులు ఈ విధంగా మాట్లాడరని, వైసీపీ నేతలు అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం అధికారం దక్కించుకోవాలనే ఆలోచనతో ఈ విధంగా మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆత్మాహుతి దళం అనే మాటలు.. కాశ్మీర్లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించినప్పుడు ఆ పదాలను ఉపయోగిస్తామని అన్నారు.
జగన్ ఏది చెప్పినా తాము చేస్తామని అన్నారంటే వీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. ఈ విషయంలో వైసీపీ వ్యవరహారశైలిని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నుంచి చరిత్ర తీసుకుంటే.. అగ్రనాయకత్వం ఒక ఆలోచన చేస్తే.. కొందరు నేతలు దాన్ని వ్యతిరేకించడం, విబేధించడం చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు.
మా నేత ఏది చెబితే అది చేస్తామని అనడం దేశ రాజకీయ చరిత్రలో లేదన్నారు. గాంధీ, నెహ్రూ, చంద్రబోష్ వంటి నేతల ఆలోచనలను వ్యతిరేకించినవాళ్లు ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ నేతలు మాటలు, భాషకు ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు.
ఆ పార్టీ నేతలు ఉపయోగిస్తున్న భాష, భావజాలం బట్టి తాము ఉగ్రవాద పార్టీ అని అంటున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారులు ఏపీ వైపు చూస్తుంటే.. వారిలో భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఆత్మాహుతి దళంలా పనిచేస్తారా?
ఈ వైసీపీ ఒక రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? pic.twitter.com/mBLBSiXapN— Swathi Reddy (@Swathireddytdp) April 12, 2026