Rain Alert: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. నేడు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. సముద్రం తీవ్ర అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉత్తర కోస్తా, పరిసర జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరితో పాటు ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రెండు జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు తీవ్రమైన పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షం పడే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల పక్కన గానీ నిల్చోవద్దని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు కోరారు. రైతులు, గొర్రెల కాపరులు పొలాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
Also Read: పగలు కోడింగ్.. రాత్రి దోపిడీ! ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పార్ట్టైమ్ జాబ్ తెలిస్తే షాకవుతారు!