AP Budget Session: ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రెండో రోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. మరోవైపు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం పవన్ కళ్యాణ్ తో భేటి కావడం.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో వీరి మధ్య ఏ ఏ అంశాలు చర్చకు వచ్చుంటాయా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మెుదలైంది.
పవన్ కళ్యాణ్ తో నాగబాబు, బాలకృష్ణ భేటికి సంబంధించిన చిత్రాలను డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ వేదికగా పంచుకుంది. వీరితో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సైతం సమావేశమైనట్లు తెలిపింది. విడివిడిగా జరిగిన ఈ భేటిల్లో పలు అంశాలపై నేతలు చర్చించినట్లు డిప్యూటీ సీఎంఓ తెలియజేసింది. అయితే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ తరహా భేటీలు జరగటం సాధారణమే. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా మంత్రిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గ సమస్యల గురించి బాలకృష్ణ చర్చించినట్లు తెలుస్తోంది. సమస్యల పరిష్కారానికి బడ్జెట్ లో తగిన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ శాసన సభలోని ఉప ముఖ్యమంత్రి పేషీలో @PawanKalyan తో భేటీ అయి చర్చించిన ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు, ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, శ్రీ ఎం. అశోక్ రెడ్డి గారు. pic.twitter.com/Ejfk0B7V4Y
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 12, 2026
ఎమ్మెల్సీగా నాగబాబుకు ఇది తొలి బడ్జెట్ సమావేశాలు. ఈ నేపథ్యంలో బడ్టెట్ సెషన్స్ లో శాసనమండలిలో ఏ విధంగా నడుచుకోవాలో నాగబాబుకు పవన్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన జనసేన పార్టీ అంతర్గత సమావేశంలో నాగబాబుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తిరుపతి లడ్డు అంశంపై నేతలు సరిగా స్పందించడం లేదంటూ పవన్ పరోక్షంగా చురకలు అంటించారన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నాగబాబు వెంటవెంటనే రెండు వీడియో సందేశాలను రిలీజ్ చేసి.. వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాగబాబుతో పవన్ భేటి కావడం చర్చకు తావిస్తోంది. తిరుపతి లడ్డు అంశంపై భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలా? అన్న విషయంపై కూడా నాగబాబుకు పవన్ దిశానిర్దేశం చేసి ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.
Also Read: YS Sharmila: సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్.. వైసీపీ వాకౌట్ సిగ్గుచేటు.. సూటి ప్రశ్నలతో ఏకిపారేసిన షర్మిల
పవన్ తో బాలకృష్ణ భేటి సందర్భంగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలోనే చిరంజీవిపై బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ అంశం కూటమి ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామాల తర్వాత బాలయ్య, పవన్ తొలిసారి భేటి కావడం గమనార్హం. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న సందేశాన్ని ఇరువురు నేతలు ఇచ్చారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీనికి తోడు త్వరలో ఇద్దరి సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఫ్యాన్ వార్ వంటి వాటికి ఆస్కారం లేకుండా ఈ భేటి ఉపయోగపడుతుందన్న చర్చ జరుగుతోంది. మెుత్తం మీద బాలకృష్ణ, నాగబాబు భేటి అంశం ఏపీలో పొలిటికల్ బజ్ ను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.
Also Read: BJP candidate: బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి