వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. పార్టీ నుంచి ఆమెకు ఎటువంటి సహకారం అందడం లేదని, తనను ఇబ్బంది పెడుతున్న వారిపై అధిష్టానానికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆమె నగరి ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా భారీ మెజార్టీతో కాదు. సీఎంగా జగన్ ప్రమాణం స్వీకారం చేశాక నేరుగా ఆయన వద్దకు రోజా.. తనను ఎన్నికల్లో ఓడించే కుట్ర జరిగిందని వివరించినట్లు చెప్పుకొచ్చారు.
వైసీపీలో రోజా ఫైర్ బ్రాండ్గా పేరొందారు. 2019కు ముందు ఉన్న అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఆమె పెద్దఎత్తున విమర్శలు చేసేవారు. అప్పటి మంత్రులకు తన విమర్శలతో ముప్పుతిప్పలు పెట్టారు.ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమె పార్టీకి అందించిన సేవలను గుర్తించిన నాటి సీఎం జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయినప్పటికీ తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నియోజకవర్గానికి చెందిన సొంత నేతలే సీఎం వద్ద లాబీయింగ్ చేశారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, రోజా మంత్రి అయ్యాక వారందరికీ మాస్ వార్నింగ్ ఇచ్చారు.తనకు వెన్నుపోటు పొడవాలని చూసిన వారికి గట్టిగానే బదులిచ్చారు.
రోజా తనకు జరిగిన అన్యాయాన్ని పలుమార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని సమాచారం.అందుకే రోజా రోజురోజుకూ ఫ్యాన్కు దూరం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.గత ఎన్నికల్లోనూ సొంత నియోజకవర్గ నేతలే ఆమెను ఓడించారని,ప్రత్యర్థి పార్టీతో కుమ్మక్కు అయ్యారని.. తన గురించి ఎన్నికల సమయంలో విషప్రచారం చేశారని ఓటమి అనంతరం ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు. ఇప్పటికీ నియోజకవర్గంలో ఆమెకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన ఎంపీపీ ఉపఎన్నికల్లో విజయపురం, నిండ్ర మండలాలు తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లాయి.దీనిపైనా ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీకి కనీస బలం లేకపోయినా, వైసీపీ ఎంపీటీసీలు అందరూ ఆవైపు చేరి గెలిపించారని, అది కూడా ఓ విజయమేనా? అని ఆమె విమర్శించారు. శ్రీశైలం పాలకమండలి మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి, మరికొందరు నేతలు కావాలనే తనకు, పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి ఎన్నికల్లో పార్టీని ఓటమికి గురిచేసి, తనకు చెడ్డ పేరు తీసుకువచ్చి పార్టీ పెద్దలకు తనను దూరం చేసేలా కొందరు నేతలు ప్లాన్ చేశారని ఆమె ప్రధానంగా ఆరోపించారు.పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ కొందరు ప్రత్యర్థి పార్టీతో కుమ్మకు అయి తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేశారని, అందుకే గత ఎన్నికల్లో తాను ఓడిపోయానని.. ఇలాంటి వ్యక్తుల వల్లే పార్టీ అధికారానికి దూరం అయ్యిందన్నారు. దీనిపై అధిష్టానానికి విన్నవించినా చర్యలు లేకపోవడంతో రోజూ పార్టీకి దూరం అయ్యేందుకు చూస్తున్నారని నగరి నియోజకవర్గంలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.