Nara Brahmani: మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వ్యాపార మ్యాగజైన్ బిజినెస్ టుడే ప్రతి సంవత్సరం ప్రకటించే ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును ఈసారి నారా బ్రాహ్మణి ఎంపికయ్యారు. వ్యాపార రంగంలో మహిళల నాయకత్వం, సంస్థల అభివృద్ధిలో వారి ముఖ్య పాత్రకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ అభివృద్ధి, బ్రాండ్ విలువను పెంచడం వంటి కీలక అంశాల్లో బ్రాహ్మణి తనదైన ముద్ర వేశారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సంస్థ పురోగతిలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.
‘నిన్న సాయంత్రం ముంబైలో జరిగిన బిజినెస్ టుడే ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డులలో గుర్తింపు పొందడం నాకు చాలా గౌరవంగా ఉంది. నా దృష్టిలో నాయకత్వం అంటే శాశ్వతమైన, బాధ్యతాయుతంగా విలువను సృష్టించే, ప్రజలకు సాధికారత కల్పించే సంస్థలను నిర్మించడం’ అని నారా బ్రాహ్మణి అన్నారు.
నారా బ్రాహ్మణి విజయంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తన అర్ధాంగిని అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. ఈ అవార్డు పట్ల భర్తగా గర్విస్తున్నానన్నారు. మాటల కన్నా పనితోనే సమాధానం చెప్పడం, నిశ్శబ్దంగా సంస్థలను నిర్మించడం బ్రాహ్మణి నాయకత్వ లక్షణాలకు నిదర్శనం అని ప్రశంసించారు.
Also Read: BARC In AP: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అనకాపల్లిలో ఏర్పాటుకు నిర్ణయం
‘మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ – 2025’ అవార్డును గెలుచుకున్న నారా బ్రాహ్మణికి మంత్రులు, టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నారా బ్రాహ్మణికి అభినందలు తెలుపుతున్నారు. భారతీయ వ్యాపార రంగంలో మహిళా సాధికారతకు నారా బ్రాహ్మణి ఒక గొప్ప ఉదాహరణగా కితాబిస్తున్నారు. బ్రాహ్మణి ప్రస్థానం ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు, ఎంతో స్ఫూర్తిదాయకం అని అంటున్నారు.