BARC In AP: ఆంధ్రప్రదేశ్ కు ప్రతిష్ఠాత్మక సంస్థలు క్యూకడుతున్నాయి. గూగుల్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మక కేంద్ర సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో మూడు వేల ఎకరాల్లో బార్క్ సంస్థను విస్తరించనున్నట్లు సమాచారం.
ఇంటికో పారిశ్రామికవేత్త, నియోజకవర్గానికి ఓ పారిశ్రామిక పార్కు నినాదంతో ఎంఎస్ఎంఈల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రం సహకారంతో 175 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దాదాపు 11 వేల కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించేందుకు అన్ని విధాలా పనిచేస్తుంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వస్తే వేగంగా అనుమతులు ఇస్తుంది. సింగిల్ విండో డెస్క్ తో అనుమతులు జారీ చేస్తూ.. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. అనుమతులు మంజూరుతో భూసేకరణ త్వరగా పూర్తి చేస్తుంది. తాజాగా కూటమి ప్రభుత్వం పలు కంపెనీలకు భారీగా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీలకు కేబినెట్తో పాటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోద ముద్రవేసింది.
విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ కంపెనీకి 100.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ కంపెనీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఐపీ గుట్టపాడు క్లస్టర్లో ఫార్మా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ కంపెనీకి ఎకరం రూ. 30 లక్షల చొప్పున మొత్తం 100 ఎకరాలకు కేటాయించింది ప్రభుత్వం. ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీకి గతంలో 105.12 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ ఉత్తర్వులను రద్దు చేసి ఆ భూములను విరూపాక్ష కంపెనీకి కేటాయించింది.
Also Read: Road accident: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం కేసులో ఎస్ఐ సస్పెండ్..
నెల్లూరు జిల్లా రాచర్లపాడులో ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ కంపెనీకి 2,776.23 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కంపెనీ రూ. 870 కోట్ల పెట్టుబడులతో 70 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.