Andhra University Centenary Celebrations: విశాఖపట్నంలో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ (AU) కి పూర్వవైభవం తీసుకువస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శతాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్.. ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచంలోనే ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా తీర్చిదిద్దేందుకు ఈ శతాబ్ది ఉత్సవాలు ఒక వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు.
శతాబ్ది ఉత్సవాల ప్రణాళికలో భాగంగా మార్చి 26 నుండి ఏప్రిల్ 26వ తేదీ వరకు నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ముఖ్యంగా పూర్వ విద్యార్థులతో మమేకం కావడంతో పాటు.. ఉత్సవాల్లో వారిని చురుకైన భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. యూనివర్సిటీ ఘన చరిత్ర ప్రతిబింబించేలా కమిటీలను సమన్వయం చేసుకోవాలని.. మీడియా పబ్లిసిటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుత విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ.. వారి కోసం కళలు.. సంగీతం.. సాహిత్యం వంటి విభిన్న కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు.
ఉత్తరాంధ్ర ప్రజలు.. విద్యార్థులను ఈ వేడుకల్లో భాగస్వాములను చేయడంతో పాటు.. ప్రముఖులతో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీ వందేళ్ల విజన్కు అనుగుణంగా భవిష్యత్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 26వ తేదీన జరగబోయే శతాబ్ది స్థాపన దినోత్సవ అజెండాను.. చేపట్టబోయే అభివృద్ధి పనులను వీసీ ఈ సందర్భంగా వివరించారు. అనుబంధ కళాశాలలను కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాసరావు.. పీజీవీఆర్ నాయుడు.. విష్ణుకుమార్ రాజు.. వెలగపూడి రామకృష్ణబాబు.. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యూనివర్సిటీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ.. శతాబ్ది ఉత్సవాల విజిబిలిటీని పెంచాలని ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
Read Also: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ 5 ఆదివారాలు మిస్ అయితే భారీ నష్టం!