ఏపీ రాజకీయాల్లో పరస్పర విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధికి పాటుపడిందని తామంటే తామని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా జనసేన పార్టీ మీద వస్తున్న అవినీతి, లైంగిక ఆరోపణలపై డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. మొన్నటివరకు పవన్ కళ్యాణ్ చాలా ప్రశాంతంగా కనిపించగా.. ఒక్కసారిగా ఆయనలో దాచుకున్న కోపాన్ని అధికారుల మీద సైతం చూపించారని చర్చ జరుగుతున్నది. అందుకు ప్రతిపక్ష వైసీపీ కుటిల రాజకీయాలే అని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నది.
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను నాడు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వారాహి యాత్రను సైతం చేపట్టారు.నాడు జగన్ హయాంలో ఏపీ ఎలా వెనక్కి నెట్టివేయబడిందని, ప్రభుత్వ వ్యవస్థలు ఎలా నిర్వీర్యం చేయబడ్డాయో.. తిరుమల తిరుపతి దేవస్థానం మీద అన్యమతస్తులు వ్యవహారం, ఉద్యోగులుగా నియమించడం, ప్రసాదంలో కల్తీ వంటి అంశాలను పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు వైసీపీకి అధికారాన్ని దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను జగన్ అండ్ కో తమ చెప్పు చేతల్లో పెట్టుకుని పాల్పడిన దోపిడీ, దౌర్జన్యాలపై నిలదీశారు. అయితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీని..ప్రతిపక్ష వైసీపీ టార్గెట్గా చేసుకుని జనసేన, టీడీపీ మధ్య లేనిపోని వైషమ్యాలను నూరిపోస్తున్నట్టు టాక్.
దీనికి తోడు జనసేన నేతలు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారని.. మహిళలను వేధిస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా వింగ్తో పాటు మరికొందరు నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో జంతు అవశేషాల నుంచి తయారు చేసిన నెయ్యిని కలపలేదని సీబీఐ కోర్టుకు నివేదిక అందజేసింది. దీనిని వైసీపీ ప్రస్తుతం ప్రధాన అస్త్రంగా మలుచుకున్నది. దీనికి తోడు జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. లైంగిక వేధింపుల అంశం సైతం వైసీపీకి బ్రహ్మాస్త్రంలా మారింది. దీంతో వైసీపీ కీలకనేతలతో పాటు సోషల్ మీడియా విభాగం జనసేనాని.. ఆ పార్టీ నేతలపై అనుచిత పోస్టులు చేస్తున్నట్టు పవన్ దృష్టికి వచ్చింది.
Body Checkup: ఆరోగ్యంగా ఉండాలా ? అయితే ఈ 5 టెస్టులు తప్పక చేయించుకోండి
దీంతో నిన్న విశాఖలో గ్రామపంచాయతీ శాఖ పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్.. అధికారుల మీద సీరియస్ అయ్యినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలోని వ్యక్తులతో కొందరు అధికారులు చనువుగా ఉంటూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని.. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని తీరుమార్చుకోకపోతే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి తోడు తనకు ‘పనులు పూర్తవడం ముఖ్యమని..పొగడ్తలు కాదని’ స్పష్టంచేశారు.ఇది పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్దేశించే వారిపై పవన్ సీరియస్ అయ్యారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. కావాలనే కొందరు వైసీపీ నేతలు అధికారులతో పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని, దీంతో ప్రజల్లో కూటమి సర్కారుపై వ్యతిరేకత రావడాన్ని సహించబోమని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.కాగా, అరవ శ్రీధర్ వ్యవహరంలో పవన్ నేటివరకు స్పందించకపోవడం ప్రభుత్వానికి మాయని మచ్చగా మారనుందని చర్చ జరుగుతున్నది.