Pawan kalyan: వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని.. హైకోర్టును ఆశ్రయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్, తప్పుదోవ పట్టించే ప్రచారం, డీప్ఫేక్ వీడియోలు, తప్పుడు కోట్స్ రూపంలో జరుగుతున్న దాడులు తన వ్యక్తిత్వ హక్కులను తీవ్రంగా భంగం కలిగిస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు.
జనసేన అధినేత తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెటా, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్) వంటి కంపెనీలు పెద్ద ఎత్తున జరుగుతున్న ఉల్లంఘనను.. నియంత్రించడంలో విఫలమయ్యాయని తెలిపారు.
తొలివిచారణలో ఢిల్లీ హైకోర్టు పిటిషన్ను పరిశీలించి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనం పవన్ కళ్యాణ్ న్యాయవాదులను గతంలో సోషల్ మీడియాలో జరిగిన ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి డేటా, ఉదాహరణలు, లింకులు, స్క్రీన్షాట్లు ఒక వారంలో సమర్పించాలని ఆదేశించింది.
సోషల్ మీడియా సంస్థలకు ధర్మాసనం హెచ్చరికలు జారీచేసింది. మెటా, గూగుల్, ఎక్స్ వంటి ప్లాట్ఫారమ్లు వ్యక్తుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉన్నదని ధర్మాసనం స్పష్టం చేసింది.
కోర్టు పిటిషన్ సంబంధిత పత్రాలను పరిశీలించిన తర్వాత కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22 కు వాయిదా వేసింది. అప్పటికి పిటిషనర్, సోషల్ మీడియా సంస్థలు సమగ్ర వివరాలు సమర్పించాలి.
పవన్ కళ్యాణ్ వంటి ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా డిజిటల్ మీడియా యుగంలో, నిరంతరంగా సోషల్ మీడియా దాడులు, ఫేక్ న్యూస్, డిఫమేషన్కు గురవుతున్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. AI ఆధారిత డీప్ఫేక్ల విస్తరణ రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు, సామాన్య ప్రజలకూ ఒక పెద్ద ముప్పుగా మారింది.
Also Read: నేడు విశాఖకు సీఎం చంద్రబాబు, లోకేష్.. భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఈ కేసు ఫలితం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా కంటెంట్ మానిటరింగ్కు ఒక కొత్త మార్గదర్శకంగా నిలవవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో NDA ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ విజయంతో ఆయన రాజకీయ ప్రభావం పెరిగిన కొద్దీ, సోషల్ మీడియాలో దుష్ప్రచారం పెరిగిందని ఆయన అనుచరులు చెబుతున్నారు.