CM Chandrababu-Lokesh: ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ముందడుగు చర్యలతో.. అంతర్జాతీయ కంపెనీలు తిరిగి రాష్ట్రంపై దృష్టి పెడుతున్నాయి. ఈ మేరకు అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నేడు సీఎం నారా చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అదే వేదికపై రాష్ట్ర ఐటీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్.. మరో ఏడు ఐటీ కంపెనీల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
విశాఖ మధురవాడ ప్రాంతం త్వరలోనే పెద్ద ఐటీ హబ్గా మారబోతోంది. కాగ్నిజెంట్ మధురవాడలో మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక శాశ్వత క్యాంపస్ను నిర్మించనుంది. ఈ క్యాంపస్ నిర్మాణంతో 8,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు.. కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ నుంచే సేవలను ప్రారంభిస్తోంది. నేటి నుంచే 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలు పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఈ తాత్కాలిక కార్యాలయాన్ని కూడా పరిశీలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి ఊపిరి పోసేందుకు.. మంత్రి నారా లోకేష్ చేపడుతున్న కార్యక్రమాలకు మరో పెద్ద అడుగు పడింది. విశాఖలో ఏడు ప్రముఖ ఐటీ సంస్థలు తమ క్యాంపస్ నిర్మాణానికి సిద్ధమయ్యాయి. సత్వా డెవలపర్స్, టెక్ తమ్మిన, నాన్ రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఐటీ ప్రాజెక్టుల ద్వారా విశాఖను దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న టెక్నాలజీ నగరంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
కాగ్నిజెంట్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం.. సీఎం చంద్రబాబు A1 కన్వెన్షన్ వద్ద జరగనున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో పాల్గొని.. వ్యాపార సంస్థలతో చర్చించనున్నారు. ఇందులో ప్రాంతీయ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, గ్లోబల్ కంపెనీలు తీసుకురాబోయే అవకాశాలు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read: పర్మిషన్ లేకుండా బర్త్డే పార్టీ.. దువ్వాడ మాధురికి పోలీసులు షాక్
కాగ్నిజెంట్ వంటి ప్రపంచస్థాయి సంస్థ విశాఖను కేంద్రంగా ఎంచుకోవడం, మిగతా ఏడు కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ఈ రెండు అంశాలు కలిసి ఉత్తరాంధ్ర ఆర్థిక పరిస్ధితికి భారీ బలోపేతాన్ని అందించనున్నాయి. ఐటీ రంగం రావడం వల్ల ఉపాధితో పాటు నగర అభివృద్ధి, రియల్ ఎస్టేట్, సేవా రంగాలు కూడా భారీగా లాభపడతాయి.