Pawan Kalyan: దిల్లీలోని జంతర్ మంతర్లో ప్రధాని మోదీని విమర్శిస్తుంటే తానేంతో బాధపడినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగలటం చాలా సహజమని వ్యాఖ్యానించారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్ పోర్ట్ సరికొత్త అధ్యాయమని కీర్తించారు.
తెలుగు జాతి ఎవరికీ తలవంచదని ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అల్లూరి సీతారామరాజు చాటి చెప్పారన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే రైల్వే జోన్ ఇచ్చి ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని పేర్కొన్నారు.
Also Read: ఎర్రబస్సు రాదన్న చోటకు ఎయిర్పోర్ట్.. చంద్రబాబు మాస్ కౌంటర్
దేశం కోసం సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నప్పటికీ ప్రధాని మోదీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. జంతర్ మంతర్ నిరసనల్లో కొందరు విద్యార్థులు దారుణంగా విమర్శించినా.. ఎన్ని బాధలు, అవమానాలు ఎదురైనా మోదీ ఎక్కడా వెనక్కి తగ్గలేదని కొనియాడారు. తనను దూషించే వారిని కూడా క్షమించే గుణం ప్రధాని మోదీది అని చెప్పుకొచ్చారు. దేశానికి మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మనందరి అదృష్టమన్నారు.
Also Read: ఉత్తరాంధ్ర బిడ్డగా చెబుతున్నా.. మోదీ ముందు రామ్మోహన్ ఎమోషనల్!