Pawan Kalyan: మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక వచ్చినప్పటికీ, వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన నేతలు విఫలమవ్వడంపై ఆయన క్లాస్ తీసుకున్నారు. “అన్ని అంశాలపై నేనే మాట్లాడాల్సి వస్తే, ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఎందుకు ఉన్నట్టు?” అంటూ ఆయన నేరుగా నిలదీశారు.
ప్రతి నియోజకవర్గంలో ఏ నేత ఏం చేస్తున్నారో, ఎవరి పనితీరు ఎలా ఉందో ఇంటెలిజెన్స్ రిపోర్టులతో సహా పూర్తి డేటా తన దగ్గర ఉందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వైకాపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తారని, అటువంటి సమయాల్లో సంయమనం కోల్పోకుండా కేవలం సబ్జెక్ట్, సిద్ధాంతపరంగానే సమాధానం ఇవ్వాలని సూచించారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యక్తిగత వ్యవహారాలు ఉంటే సహించేది లేదని, అటువంటి వారి వల్ల మొత్తం పార్టీకి నష్టం కలుగుతుందని స్పష్టం చేశారు. సమావేశం మధ్యలోనే ఆయన ఆగ్రహంతో బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
అధినేత వెళ్ళిపోయిన అనంతరం నాదెండ్ల మనోహర్ ఈ సమావేశాన్ని కొనసాగిస్తూ, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై రిపోర్టులు సిద్ధం చేయాలని ఆదేశించారు. చంద్రబాబు కుటుంబంపై లేదా జనసేన సిద్ధాంతాలపై వైకాపా దాడి చేస్తున్నప్పుడు మౌనంగా ఉండటం సరికాదని, రేపటి నుండి ప్రతి విమర్శను అంతే దీటుగా ఎదుర్కోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ అవుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడంపై సీరియస్ అయ్యారు. క్రమశిక్షణ తప్పినా, ప్రజాక్షేత్రంలో వైఫల్యం చెందినా కఠిన నిర్ణయాలు ఉంటాయని ఈ సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతాలిచ్చారు.
Read Also: Kesineni Chinni on YCP: వైసీపీ ఒక ‘నకిలీ పార్టీ’.. జగన్ కుట్రలు సాగవు.. కేశినేని చిన్ని ఫైర్!