Minister Seethakka: ములుగు స్వేఛ్చ బ్యూరో: ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే కొంతమంది రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, కొందరు స్వాములు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మేడారం జాతర నిర్వహణలో భాగంగా వారం రోజుల పాటు తాము 24 గంటలు అక్కడే ఉండి పనిచేశామని, కోట్లాది మంది భక్తులు సుఖశాంతులతో దర్శనం చేసుకున్నారని తెలిపారు. జాతరను సక్సెస్ చేయడంలో సహకరించిన ములుగు జిల్లా మీడియా సోదరులకు, అధికారులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
గుడి నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచే ఆదివాసీ విశ్వాసాలకు వ్యతిరేకమని తప్పుడు ప్రచారాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. గుడిలో చేసిన ప్రతి మార్పు పూజారుల ఆమోదం, ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే జరిగిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ సమ్మక్క గద్దెల వద్ద కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. శుక్రవారం సాయంత్రం విఐపి వాహనాలు భారీగా రావడంతో కొంతసేపు ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడిందని, అది బస్సులు లేకపోవడం వల్ల కాదని తెలిపారు. గత జాతరలతో పోలిస్తే ఈసారి ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గాయని పేర్కొన్నారు. కొంతమంది విఐపిలు వందలాది మందితో, అనేక వాహనాలతో రావడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. వ్యక్తిగత భూముల్లో జరిగిన చిన్న వ్యాపారాలను కూడా దందాలుగా చిత్రీకరించడం కుట్రపూరితమని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా అక్రమాలు చేస్తే తామే బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు.
జాతరలో ప్రమాదాలు జరుగుతాయని, ప్రాణనష్టం జరుగుతుందని యూట్యూబ్లు, టీవీ ఛానళ్లలో చేసిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఈసారి మాస్తో పాటు క్లాస్, సూపర్ క్లాస్ భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం కొందరికి జీర్ణించుకోలేక నెగటివ్ నరేటివ్ను సృష్టిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలపై మాట్లాడితే మాట్లాడొచ్చుగానీ, దేవతలను, జాతరను కించపరచడం సహించబోమన్నారు. జాతరలో 13 వేల మంది పోలీసులు, 40 రోజుల పాటు జిల్లా యంత్రాంగం సేవలందించిందని తెలిపారు. తాగునీటి ట్యాంకులు, చలివేంద్రాలు, టాయిలెట్లు, షెడ్లు, తల్లులు,పిల్లల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామని వివరించారు. చిన్నచిన్న లోపాలు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకుంటామని తెలిపారు. సమ్మక్క, సారలమ్మలు అన్ని కులాలు, అన్ని మతాలు నమ్మే ప్రకృతి దేవతలని, వారి కీర్తిని తగ్గించే కుట్రలను తక్షణమే మానుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే తమ బాధ్యతని స్పష్టం చేశారు.
Also Read: Bandam Kunta: అక్రమార్కుల చేతిలో మాయమవుతున్న బంధం కుంట.. పట్టించుకోని అధికారులు