Kesineni Chinni on YCP: టిడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి , ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. జగన్ మాత్రం కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే జగన్ కొత్త డ్రామాలకు తెరలేపారని, వైసీపీ నేతలతో చంద్రబాబును బూతులు తిట్టిస్తున్నారని చిన్ని ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు కులాన్ని వాడుకుంటున్నారని, గతంలో బాబాయ్ని హత్య చేసి ఆ నిందను చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం విజయవాడ ప్రశాంతంగా ఉందని.. కానీ మళ్ళీ అక్కడ అలజడి సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు తమ ఇళ్లను తామే తగలబెట్టుకుని సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నారని.. దాడులు జరుగుతాయని తెలిసినప్పుడు ఇంట్లో 50 మంది గుండాలను ఎందుకు పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు.
వంగవీటి రంగా మరణం, రాజకీయ ఎదుగుదలపై కూడా కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రంగాను రాజకీయంగా ఎదగకుండా అణచివేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, రంగా హత్య కేసులో కీలకంగా ఉన్న వ్యక్తులు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. రంగాను తాము బడుగు బలహీన వర్గాల నాయకుడిగా గౌరవిస్తామని చెప్పారు.
జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి నేతల వ్యాఖ్యలను తాము పట్టించుకోమని, వారు కేవలం జగన్ డైరెక్షన్ లో పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని, ఆ పార్టీ ఒక ‘నకిలీ పార్టీ’ అని ఆయన అభివర్ణించారు. చంద్రబాబు ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకమని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నామని చెబుతూనే.. టీడీపీకి ఉన్న కోటి మంది సభ్యుల బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు.
Also Read: అంబటి ఓ టిష్యూ పేపర్.. జగన్ వాడుకొని పాడేస్తాడు.. మంత్రి మండిపల్లి సంచలన వ్యాఖ్యలు