Pawan Kalyan Vs Peddireddy: అటవీ భూముల జోలికి వెళితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. వన్య ప్రాణి రక్షిత అటవీ భూముల్లో, అటవీ ప్రాంతాల్లో భూములను కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించిన వాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు.
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యుల అటవీ భూముల ఆక్రమణలపై తన వద్ద ఉన్న నివేదికలు, వీడియోలను సీఎం చంద్రబాబు, సహచర మంత్రుల వద్ద పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. త్వరలోనే అన్ని వివరాలతో ఆక్రమణ విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఇటీవల చిత్తూరు జిల్లా ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరం సందర్శించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా మంగళంపేట అటవీ ఆక్రమణలను పరిశీలించారు. అడవిలో వేసిన కంచె, సరిహద్దులను హెలికాప్టర్ ప్రయాణించి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అటవీ భూములు, శాఖ ఆస్తులు పరిరక్షణ అంశంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
#OperationAranya https://t.co/LdfLFSwfY5
— JanaSena Party (@JanaSenaParty) November 13, 2025
మంగళంపేట అటవీ భూముల అంశాన్ని అధికారులు వివరించారు. అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్, ఛార్జ్ షీట్ దాఖలు చేశామని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు ప్రొడ్యూస్ చేశామన్నారు. పి.ఓ.ఆర్., విజిలెన్స్ నివేదిక వివరాలపై చర్చించిన డిప్యూటీ సీఎం పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్ సైట్ లో వెల్లడించాలని, ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలను ప్రజలకి తెలియాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూములలో ఆక్రమణలు చోటు చేసుకున్న మాట వాస్తవమని పీసీసీఎఫ్ (హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్) పి.వి.చలపతిరావు వెల్లడించారు. ఆక్రమణలపై బీఎన్ఎస్ చట్టం, ఏపీ అటవీ చట్టంలోని పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఏ1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఏ2గా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఏ3గా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేర్లు ఉన్నాయన్నారు. అటవీ చట్టం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ ప్రకారం ఛార్జీషీటు దాఖలు చేశామన్నారు. ఆక్రమణకు గురైన 32.63 ఎకరాల భూమిని స్వాధీనం చేస్తుకున్నామని తెలిపారు.
“1968 గెజిట్ ప్రకారం మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాలకు పట్టాలు ఉన్నాయి. అయితే 32.63 ఎకరాల అటవీ భూమిని కూడా కలిపేసుకున్నారు. దానికి కంచె వేశారు. ఆ అటవీ భూముల్లో ఉద్యాన పంటలు వేసి సాగు చేసి, ఆదాయం పొందారు. చట్ట విరుద్ధంగా బోర్ వెల్ తవ్వారు. అటవీ వనరులు దుర్వినియోగం చేశారు. దాదాపు రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లింది. 32.63 ఎకరాలకు చట్టబద్ధమైన పత్రాలను సమర్పించలేకపోయారు.
అటవీ భూములు ఆక్రమించిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. అటవీ భూముల అన్యాక్రాంతంపై విచారణకు రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటు చేశాము. అటవీ భూముల వివరాలను వెబ్ సైట్లో పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు” -పి.వి.చలపతిరావు
Also Read: Pawan Kalyan Warns MLAs: క్యాబినెట్ మీటింగులో పవన్ చిచ్చు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపణలపై ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మిథున్రెడ్డి వరుస ట్వీట్లు పెట్టారు. మంగళంపేట భూములను 2000 సంవత్సరంలోనే చట్టబద్దంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఉన్నాయనీ, వాటిని ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చని సూచించారు.