YCP activist Arrested: శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో రాజకీయ కక్షల నేపథ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంధ్యారాణి అనే నిండు గర్భిణీపై వైసీపీ కార్యకర్త అజయ్ దేవా అత్యంత కిరాతకంగా దాడికి తెగబడ్డాడు. గర్భిణీ అని కూడా చూడకుండా ఆమె కడుపుపై కాలితో తన్నడంతో ఆ మహి తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. గర్భిణీ మహిళపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి మృగాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడంతో పాటు, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు అజయ్ దేవాను అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై దాడులు చేస్తే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రజలందరికీ తెలిసేలా పోలీసులు వినూత్నంగా వ్యవహరించారు.
నిందితుడిని కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు నడిరోడ్డుపై నడిపించి ఊరేగించారు.
భవిష్యత్తులో మరొకరు ఇటువంటి దారుణాలకు ఒడిగట్టాలంటేనే భయపడేలా పోలీసులు ఈ ఊరేగింపు నిర్వహించారు. నిందితుడిని పట్టణం నడిబొడ్డున నడిపించడం ద్వారా.. ఆడబిడ్డలపై చేయి వేస్తే చట్టం ఊరుకోదనే బలమైన సందేశాన్ని పంపారు. నిందితుడి వెనుక ఎంతటి రాజకీయ బలం ఉన్నా వదిలిపెట్టమని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Also Read: భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఇక తులం కొనాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే
ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మరికాసేపట్లో కదిరి పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ దాడికి గల ప్రాథమిక కారణాలు, నిందితుడిపై నమోదైన సెక్షన్లు, బాధితురాలి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించనున్నారు.
జగన్ గారి జన్మదినం జనాలకు ప్రాణసంకటంగా మారింది. రప్పా రప్పా వైసీపీ ఉన్మాదం ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితిని విషమం చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా, తనకల్లు మండలం, ముత్యాల వారి పల్లెలో జగన్ పుట్టినరోజు సందర్భంగా తమ ఇంటి ముందు టపాసులు కాల్చొద్దని వారించినందుకు.. గర్భిణిపై దాడి చేశారు… pic.twitter.com/CGJ7r4qAT1
— Lokesh Nara (@naralokesh) December 22, 2025