Vemulawada Temple: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయ పరిధిలోని భీమేశ్వరాలయం వద్ద సమ్మక్క సారక్క మాలధారణలో ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. తమకు కనీస దర్శన భాగ్యం కూడా కల్పించడం లేదంటూ వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వేములవాడలో ప్రస్తుతం అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. రాజన్న స్వామి ప్రధాన దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఈ కారణంగా భక్తులు సంప్రదాయంగా భీమేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా సమ్మక్క–సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రం నలుమూలల నుంచి మాలధారణలో ఉన్న భక్తులు పెద్ద ఎత్తున వేములవాడకు తరలివస్తున్నారు.
అయితే ఈ భక్తులకు భీమేశ్వరాలయంలో సక్రమంగా దర్శనం కల్పించడంలో ఆలయ సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ దర్శనం అనుమతించకుండా.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించడం, మిగిలిన వారిని వెనక్కి పంపించడం వల్ల అసహనం మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
దర్శనం కోసం ఉదయం నుంచే భీమేశ్వరాలయం వద్ద వేచిచూస్తున్న భక్తులు, చివరకు ఓపిక కోల్పోయి ఆలయ ద్వారం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.
భక్తుల ఆందోళనతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆలయ భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భక్తులకు సర్దిచెప్పి, శాంతియుతంగా సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. అయితే అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చి, దర్శనం కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని భక్తులు తేల్చిచెప్పారు.
Also Read: ప్లే స్కూల్ పరిచయం.. పచ్చని కాపురంలో చిచ్చు.. చివరకు భర్త హత్య
స్థానికులు కూడా ఈ ఘటనపై చర్చించుకుంటున్నారు. సాధారణ భక్తులతో పాటు, ప్రత్యేక దీక్షలో ఉన్న సమ్మక్క–సారక్క భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.