AP Politics : తెనాలి గొడవ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇటీవల ముగ్గురు యువకులను నడిరోడ్డుపై లాఠీలతో చితకబాదారు పోలీసులు. ఆ ముగ్గురు దళితులని, అన్యాయంగా కొట్టారంటూ వైసీపీ రచ్చ స్టార్ట్ చేసింది. కాదు కాదు ఆ ముగ్గురు నేరగాళ్లని, గంజాయి అమ్ముతుంటారని, కానిస్టేబుల్ను సైతం కొట్టారంటూ టీడీపీ చెబుతోంది. ఈ ఎపిసోడ్లో జగన్ సైతం ఎంటర్ అయ్యారు. మంగళవారం తెనాలి వెళ్లి.. ఆ ముగ్గురు యువకులను పరామర్శించనున్నారు.
రౌడీషీటర్లకు జగన్ పరామర్శ!
అదేంటి? రౌడీషీటర్లను జగన్ కలిసి ఓదార్చడమేంటని టీడీపీ కస్సు మంటోంది. రెండు పార్టీల మధ్య మాటల మంట రాజుకుంది. జగన్ టూర్ వివాదాస్సదంగా మారింది. గతంలో తమ పార్టీకి చెందిన నాయకుడి కుమారుడిపై నిందితులు దాడి చేసి కొట్టిన వీడియోను టీడీపీ రిలీజ్ చేయడంతో మేటర్ మరింత రంజుగా మారింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ తెనాలి పర్యటనపై హైటెన్షన్ క్రియేట్ అయింది.
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే..
వైఎస్ జగన్ తెనాలి పర్యటనపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. మంగళవారం తెనాలిలోని ఐతానగర్కు వెళ్లనున్నారు జగన్. ఇటీవల పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న ముగ్గురు నిందితులను పరామర్శించనున్నారు. ప్రతి విషయాన్ని వైసీపీ రాజకీయం చేయాలని చేస్తోందని మండిపడ్డారు హోంమంత్రి అనిత. నేరస్తులను రోడ్డు మీద కొడితే తప్పేంటని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే.. జగన్ తెనాలి పర్యటన చేస్తున్నారని తప్పుబట్టారు.
క్రిమినల్స్కు ఓదార్పు యాత్రనా?
ఏదో ఒక రకంగా ఉనికిలో ఉండాలని వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు టీడీపీ నేత ఎంఎస్.రాజు. జగన్ పరామర్శించేందుకు వెళ్తున్న ముగ్గురిపై ఎన్నో కేసులు ఉన్నాయన్నారు. అలాంటి వారిని పరామర్శించడం ఏంటని నిలదీశారు.
తెనాలి వెళితే తప్పేంటి?
టీడీపీ వాదనను వైసీపీ ఖండిస్తోంది. జగన్ ఐతానగర్ వెళ్లి బాధిత యువకులను పరామర్శిస్తే.. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఆరాచకం మరోసారి బయటకు వస్తుందని టీడీపీ భయపడుతోందన్నారు. కానిస్టేబుల్పై హత్యాయత్నం చేసుంటే సాక్ష్యాలు ఏవి? అని ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు సాక్ష్యాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీస్తోంది. దళిత యువకులను పోలీసులు కొట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు వైసీసీ నేత సుధాకర్ బాబు. అన్యాయం జరిగిన చోటుకు జగన్ వెళ్తారు.. బాధితులను పరామర్శిస్తారని స్పష్టం చేశారు.