Pawan Kalyan: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ హాల్ లో భగవాన్ శ్రీ సత్యసాయి మహా సమాధిని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సత్య సాయి బాబా గొప్పతనం దేశ ప్రజలతో పాటు విదేశస్థులకు బాగా తెలుసన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లల్లో సత్య సాయిబాబా చిత్రపటాలు చూశామన్నారు. హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అన్నయ్య చిరంజీవిని సత్య సాయిబాబా గురించి ప్రత్యేకించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుట్టపర్తి వచ్చి బాబా ఆశీర్వాదం తీసుకున్నారన్నారు.
“కొన్ని దశాబ్దాల క్రితం ఎవరన్నా ఊహించుకుని ఉంటారా? దేశ విదేశాల నుండి ఎంతో మంది భక్తులు ఈ వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధికి పాటు పడతారని! ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం. సత్య సాయిబాబా సేవాతత్పరతకు ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఇక్కడ సేవ చేసే వీళ్లందరినీ చూస్తుంటే మా వదిన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ భోజనం చేసినప్పుడు వారికి వడ్డించిన వ్యక్తి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకు ఖాళీ ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవలు చేసేవారట.
ప్రత్యేకించి ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు ఎంత మందిని ప్రభావితం చెయ్యగలడు అనడానికి ఇక్కడున్న సచిన్ టెండూల్కర్ కావొచ్చు, వేదిక పైన వేదిక ముందు ఉన్న ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉదాహరణ. వీళ్లందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురంలో ప్రపంచానికి వెలుగునిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం. ఆయన శతజయంతి సందర్భంగా అందరం కలవడం ఆనందాన్ని కలిగించింది”- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్