Vizag: విశాఖ సిటీని ఐటీ హబ్గా మారుస్తామని పదే పదే కూటమి సర్కార్ చెబుతోంది. ఏపీకి వచ్చిన ఐటీ కంపెనీలన్నీ విశాఖ వైపు దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా గూగుల్ ఆ ప్రాంతానికి రావడం, మరోవైపు సముద్రం ఉండడంతో ఎక్కువగా ఐటీ కంపెనీలు అటువైపు ఫోకస్ చేశాయి. ప్రభుత్వం కూడా వెంట వెంటనే అనుమతులు మంజూరు చేస్తోంది.
విశాఖకు ఐటీ కంపెనీలు రాక
విశాఖ సిటీలోని కాపులుప్పాడ ప్రాంతానికి మరో ఐటీ కంపెనీ రానుంది. ఆ కంపెనీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్కు అనుమతి మంజూరు చేసింది. దాదాపు రూ. 115 కోట్లతో ఐటీ కంపెనీని నిర్మించనుంది. ఈ కంపెనీ ద్వారా దాదాపు 2 వేల ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్డ్ డిజిటల్ ఇంజినీరింగ్, ఏఐఎంఎల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక విభాగాలను ఆ క్యాంపస్ లో ఉండనున్నాయి.
ఎకరం కోటి చొప్పున 4 ఎకరాలు భూమి ఆ సంస్థకు కేటాయించింది ప్రభుత్వం. రెండేళ్లలో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించనుంది ఆ సంస్థ. ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాలని ఆదేశాల్లో ప్రస్తావించింది. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఐటీ-ఎలక్ట్రానిక్స్ విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ సంస్థలకు భూముల కేటాయింపు
ప్రాజెక్టు నిర్మాణం-నిర్వహణకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు అమలులో ఏపీటీఎస్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మధ్యకాలంలో అంతవేగంగా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలను చూడలేదని అంటున్నారు ఐటీ ప్రతినిధులు.
ALSO READ: ఏపీలో చారిత్రాత్మక ఘట్టం.. ఒకేసారి మూడు లక్షల మంది గృహ ప్రవేశాలు
ఈ సంస్థకే కాదు చాలా కంపెనీలు విశాఖ తీరానికి రానున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఐటీ కంపెనీలకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రహేజా కార్ప్కు 27 ఎకరాలు ఇవ్వనుంది. దాదాపు రూ. 2,172 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఫ్లూయెంట్గ్రిడ్ సంస్థ రూ. 150 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మదర్సన్ నెక్స్ట్ టెక్ కంపెనీ రూ.109 కోట్లు, ఐస్పేస్ సాఫ్ట్వేర్ కంపెనీ రూ. 119 కోట్లతో ఐటీ కంపెనీలు పెట్టనున్నాయి.