CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 3 లక్షల గృహప్రవేశాలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
17 నెలల తక్కువ సమయంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం, లబ్ధిదారుల చేతుల్లో కొత్త సంతోషాలను అందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పలు పథకాల ద్వారా గృహనిర్మాణం వేగంగా సాగింది. పీఎంఏవై-బీఎల్సీ కింద 2,28,034 ఇళ్లు, పీఎంఏవై-గ్రామీణ్ పథకం కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై-జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లు, మొత్తం 3,00,192 పక్కా గృహాలు నిర్మాణం పూర్తి చేశారని తెలిపారు.
ఈ ఇళ్లలో నేడు లబ్ధిదారులు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో గృహప్రవేశం చేయనున్నారు. ప్రతి జిల్లాలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉదయం 11:50 గంటలకు ప్రజా వేదికలో జరిగే సభలో పాల్గొని, పేదల ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్గా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 1:30 నుండి 1:40 వరకు సోషల్ మీడియా ఫాలోవర్స్తో మాట్లాడి, పేదల సంక్షేమంపై ప్రభుత్వ సంకల్పాన్ని వివరించనున్నారు. అనంతరం 2:30 గంటలకు చిన్నమండెం చేరుకుని టిడిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4:05 గంటలకు హెలిపాడ్కు చేరుకుని, కడప ఎయిర్పోర్ట్ ద్వారా విశాఖపట్నం వెళ్తారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ సొంతిల్లు అందించే పథకంలో భాగంగా ఈ గృహప్రవేశాలు నిర్వహిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో ఈ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
Also Read: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఇష్యూ.. ప్రత్యేక బోర్డు కావాలన్న పవన్, డ్రామాలొద్దన్న రోజా
రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు మూడు లక్షల గృహప్రవేశాలు జరగడం ద్వారా ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే దిశలో మరో ముందడుగు వేసింది. ఇది కేవలం గృహనిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం, మహిళా భద్రత, సామాజిక గౌరవం కలగజేసే పథకం అని అభిప్రాయపడుతున్నారు.