రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న బ్లాక్ మెయిల్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న హర్ష వీణ అనే మహిళ తన కుమారుడిని బ్లాక్ మెయిల్ చేస్తోందని.. అనుచితంగా ప్రవర్తిస్తోందని ఈ నెల 7వ తేదీన ప్రమీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కీలక సెక్షన్ల కింద కేసు నమోదు..
ఎమ్మెల్యే తల్లి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక ఆధారాలను పరిశీలించి, హర్ష వీణపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 308(5), 351(2), 61(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అర్బన్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇవన్నీ నాన్-బెయిలబుల్ కేసులు కావడం గమనార్హం.
ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలకు పోలీసులు పెద్దపీట వేస్తున్నారు. నిందితురాలు హర్ష వీణకు సంబంధించిన కాల్ డేటా, వీడియోలు, ఆడియోలు, ఫోటోలను సేకరిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఆమె దగ్గర ఉన్నట్లు చెబుతున్న సమాచారాన్ని కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరింత స్పష్టత కోసం త్వరలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేస్తామని పోలీసులు ప్రకటించారు.
నిందితురాలి కోసం గాలింపు..
ప్రస్తుతం హర్ష వీణ పోలీసులకు అందుబాటులో లేరని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని, స్థానికంగా ఆమె జాడ లేదని సమాచారం. ‘హర్ష వీణ నేరుగా విచారణకు హాజరైనా లేదా ఆమె ఉన్న చోటుకు రమ్మని పిలిచినా వెళ్లి విచారించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రస్తుతం ఆమె మాకు అందుబాటులో లేదు’ అని పోలీసులు పేర్కొన్నారు.
విలేకరిపై దాడి కేసు..
కేవలం ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ వ్యవహారమే కాకుండా, స్థానిక విలేకరి శంకర్ రాజుపై జరిగిన దాడి ఘటనలోనూ హర్ష వీణపై కేసు నమోదైంది. విలేకరిని నిర్బంధించి, భౌతికంగా దాడి చేసి గాయపరిచినట్లు పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. దీంతో ఆమెపై మొత్తం రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ దర్యాప్తును అత్యంత వేగంగా పూర్తి చేసి, దోషులను చట్టం ముందు నిలబెడతామని రైల్వే కోడూరు పోలీసులు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.