Scrub Typhus Cases: ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు వణుకు పుట్టిస్తున్నాయా? అన్ని జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయా? సకాలంలో ట్రీట్ మెంట్ తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవా? రకరకాల సమస్యలకు దారి తీస్తుందా? అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
ఏపీలో వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసులు
స్క్రబ్ టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా వచ్చే ఈ వ్యాధి. ఈ తరహా కేసులు రాష్ట్రమంతా వ్యాపిస్తోంది. సోమవారం నాటికి ఆ తరహా కేసులు దాదాపు 1317 కు చేరినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీనిబారిన పడి విజయనగరానికి చెందిన ఓ మహిళ సోమవారం మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మృతురాలు చీపురుపల్లి మండలం మెట్టపల్లికి చెందిన రాజేశ్వరిగా గుర్తించారు. కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిందని నిర్ధారించారు వైద్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది.
అన్ని జిల్లాల్లో కేసులు నమోదు
స్క్రబ్ టైఫస్స్ జ్వరాలతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు 42 కేసులు పాజిటివ్ వచ్చినట్టు ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహ నాయక్ తెలిపారు. 232 మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. నల్లి మాదిరిగా పోలి ఈ పురుగు ఉంటుందన్నారు. ఎక్కువగా అపరిశుభ్ర ప్రదేశాలు, మొక్కలు, నిల్వ నీరు ఉండే ప్రదేశాల్లో ఉంటుందన్నారు.
కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతున్న సమయంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీ సెంటర్లల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడపలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64 నమోదు అయ్యాయి.
ALSO READ: మండలి ఛైర్మన్తో ఆరుగురు ఎమ్మెల్సీలు భేటీ
విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. సాధారణ యాంటిబయాటిక్స్తో వ్యాధి నయం అవుతుందని, అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్య అధికారులు.
జ్వరం, బాడీ పెయిన్స్, జలుబు లక్షణాలతో స్కబ్ టైపస్ వ్యాధి లక్షణాలు తెలుస్తుందని అంటున్నారు వైద్యులు. ఈ వ్యాధి ప్రమాదకరం కాదు కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అన్ని వయసుల వాళ్ళకి ఈ వ్యాధి సోకుతుందని, జ్వరం వచ్చిన నాలుగు రోజుల తర్వాత ఒంటిపై నల్లటి మచ్చలాగా వస్తాయన్నారు.
రూరల్ ప్రాంతాల్లో జ్వరం వచ్చిన పేషంట్లను వైద్యులు నిత్యం చెక్ చేసి ట్రీట్మెంట్ చేయాలని చెబుతున్నారు విశాఖ కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ వాణి. సకాలంలో గుర్తించి వైద్యం చేయించకుంటే శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చని చెబుతున్నారు. మెదడు, వెన్నెముక ఇన్ఫెక్షన్లు, మూత్ర పిండాల వైఫల్యానికి దారి తీస్తుందని చెబుతున్నారు.
ఈ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. మనుషుల నుంచి మనుషులకు ఇన్ఫెక్షన్ సోకదని, కీటకం కాటుకు అస్వస్థతకు గురవుతారని చెబుతున్నారు. ఫుల్ హేండ్స్ షర్ట్, ప్యాంట్లు, కాలికి సాక్సులు, బూట్లు ధరించాలని చెబుతున్నారు.
ఇళ్లలో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి చొరబడే అవకాశం ఉందని, వాటిని శుభ్రం చేశాకే వాడాలని చెబుతున్నారు. పిల్లలపై ఆ తరహా కేసులు ఎక్కువ ప్రభావం చూపనుందని అంటున్నారు. ఆటలాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.