AP News: కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతుల గారాల పట్టి పునర్వికశ్రీ. 11 నెలల వయసులోనే ఆ చిన్నారి ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ (SMA Type-1) అనే అత్యంత అరుదైన జన్యు వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కండరాల పెరుగుదల నిలిచిపోయి ప్రాణాపాయం పొంచి ఉంటుంది. ఆ చిన్నారిని మృత్యువు కౌగిలి నుంచి రక్షించాలంటే దాదాపు రూ.16 కోట్ల విలువైన ‘జోల్గెన్స్మా’ ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆ తండ్రికి అంత భారీ మొత్తం సమకూర్చడం అసాద్యంగా మారింది.
సోషల్ మీడియా మహా శక్తి
తమ బిడ్డను కాపాడుకోవడానికి ఆ దంపతులు చేసిన ఆర్తనాదం సోషల్ మీడియా వేదికగా లక్షలాది మందిని కదిలించింది. తెలుగు రాష్ట్రాల్లోని కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ విషయాన్ని బాధ్యతగా తీసుకుని పెద్ద ఎత్తున ‘క్రౌడ్ ఫండింగ్’ ప్రచారాన్ని చేపట్టారు. ముఖ్యంగా ‘ట్రావెల్ విత్ జగదీష్’ వంటి ఇన్ఫ్లుయెన్సర్లు ముందుండి నడిపించడంతో యువత ఉత్సాహంగా కదిలింది. రూపాయి రూపాయి కలిపి దాదాపు రూ.8.53 కోట్లకు పైగా విరాళాలు సేకరించడం సోషల్ మీడియాకున్న సానుకూల శక్తికి నిదర్శనంగా నిలిచింది.
తెలుగు వారి ఐక్యత – అద్భుత స్పందన
ఈ పోరాటంలో ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరూ ఒక్కటయ్యారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం అందించారు. ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన లభించడంతో ఆశించిన మొత్తం సమకూరింది. వాస్తవానికి రూ.16 కోట్లు ఖర్చవుతుందని భావించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రూ.10 కోట్ల లోపే వైద్యం పూర్తయ్యే అవకాశం ఉందని తెలియడం ఊరటనిచ్చే అంశం. అసాధ్యమని భావించిన కోట్లాది రూపాయల సేకరణ కేవలం ప్రజా మద్దతుతోనే సాధ్యమైంది.
తండ్రి కృతజ్ఞత..
చిన్నారి చికిత్సకు అవసరమైన నిధులు సమకూరడంతో, పునర్విక తండ్రి సురేష్ కుమార్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. ఇకపై ఎవరూ విరాళాలు పంపవద్దని, తమ లక్ష్యం నెరవేరిందని ఆయన విజ్ఞప్తి చేశారు. అడగడంలో ఎంత నిజాయితీ ఉందో, అవసరమైన మొత్తం రాగానే వద్దని చెప్పడంలోనూ అంతే సంస్కారాన్ని ఆయన ప్రదర్శించారు. ప్రస్తుతం పాప ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తమ ముందుకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మానవత్వపు పరిమళం..
విరాళాల రూపంలో అందిన ప్రతి పైసాను పారదర్శకంగా వినియోగిస్తామని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. తన కుమార్తె వైద్యానికి అవసరమైన ఖర్చు పోను, మిగిలిన మొత్తాన్ని ఇలాగే ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న ఇతర నిరుపేద పిల్లల వైద్యం కోసం కేటాయిస్తానని ఆయన ప్రకటించడం విశేషం. తాను వ్యక్తిగతంగా రూపాయి కూడా తీసుకోనని, ఆపదలో ఉన్న ఇతరులకు ఆ డబ్బు అందేలా చూస్తానని చెప్పడం ద్వారా ఆయన తన గొప్ప మనసును చాటుకున్నారు.
Also Read: జగన్ కుట్రలు బట్టబయలు చేసిన టీడీపీ ఎంపీ! లడ్డూ కల్తీ నుంచి హెరిటేజ్ అటాక్ వరకు.. అసలు నిజాలివే!
పునర్విక ఉదంతం కేవలం ఒక ప్రాణాన్ని కాపాడటం మాత్రమే కాదు, ఆపదలో ఉన్నప్పుడు తోటి మనిషికి అండగా నిలబడాలనే స్పూర్తిని అందరిలోనూ నింపింది. ఆధునిక కాలంలో స్వార్థం పెరిగిపోతుందన్న వాదనను తలకిందులు చేస్తూ, మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపించింది. యావత్ తెలుగు జాతి ఆశీస్సులు తోడవ్వడంతో, పునర్విక త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి తన తల్లిదండ్రుల ఒడిలో చిరునవ్వులు చిందిస్తుందని ఆశిద్దాం.
కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు సోషల్ మీడియా వేదికగా జరిగిన భారీ విరాళాల సేకరణ విజయవంతమైంది. అరుదైన SMA (స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ) వ్యాధితో బాధపడుతున్న ఈ పాపకు ₹16 కోట్ల విలువైన ఇంజెక్షన్ కోసం దాతలు స్పందించి పూర్తి మొత్తాన్ని సమకూర్చారు. అవసరమైన… pic.twitter.com/3szehGDZOq
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2026