Appalanaidu On Jagan: టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అన్ని ఆధారాలను బయటపెట్టిందని.. ఈ విషయంలో జగన్ తన తప్పును ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.
హెరిటేజ్ సంస్థ జగన్ కంపెనీల మాదిరిగా అక్రమ మార్గాల్లో పుట్టింది కాదని అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఎంతో మంది మేధావుల ప్రశంసలు పొందిన హెరిటేజ్ సంస్థపై జగన్ బురద జల్లడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. నారా భువనేశ్వరి నాయకత్వంలో ఈ సంస్థ పారదర్శకంగా నడుస్తోందని.. గతంలో ఆమె ప్రజలను చైతన్యం చేస్తూ పర్యటించినందుకే కక్ష పూరితంగా జగన్ హెరిటేజ్ సంస్థను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న సంస్థపై కుట్రలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
హిందువుల మనోభావాలను గత వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని.. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని అప్పలనాయుడు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన కొత్త రాజకీయ సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ.. ప్రత్యర్థి పార్టీల నేతల కుటుంబ సభ్యులతో కూడా గౌరవంగా మాట్లాడే సంస్కృతిని లోకేష్ తీసుకొచ్చారని.. జగన్ పాలనలో ఇలాంటి గౌరవం ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ నాలుగు గోడలకే పరిమితమై.. అక్కడ ఎవరో చెప్పిన విషయాలను పట్టుకుని గంటల తరబడి మీడియా ముందు మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. ప్రజలతో మమేకం కావడం కానీ.. కనీసం క్రికెట్ వంటి క్రీడలను ఆస్వాదించడం కానీ జగన్ వల్ల కాదని ఆయన మనస్తత్వం ఎప్పుడూ కుట్రలు, రాజకీయ లబ్ధి చుట్టూనే తిరుగుతుందని ఎంపీ అప్పలనాయుడు విమర్శించారు.
Also Read: రెండు నెలల పసికందు సజీవ దహనం.. ఆ తల్లి చేసిన పనికి కంగుతిన్న పోలీసులు!