Rain Alert: నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా గడిచిన రెండు, మూడురోజులుగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలను వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ప్రవేశంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణ కాస్త హాట్గా ఉంటోంది. సాయంత్రం అయ్యేసరికి వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశముందని తెలిపారు. కొమురంభీం అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
శుక్రవారం ఏపీ-తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
నల్గొండలో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పడుతుందని చెప్పింది. ఈ లెక్కన హైదరాబాద్లో వాతావరణం శుక్రవారం హాట్ గా ఉండే అవకాశముందని అంటున్నారు.
మరోవైపు ఏపీలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్రను తాకిన రుతుపవనాలు.. రెండు లేదా మూడు రోజుల్లో ఉత్తరాంధ్రకు పూర్తిగా విస్తరించనున్నాయి. అందుకు వాతావరణ అనుకూలంగా ఉందని వెదర్ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ALSO READ: ఒమన్ నౌక దాడిలో విషాదం.. మృతి చెందిన వారిలో ఏపీ వాసి..!
తెలంగాణ నుంచి దక్షిణ కోస్తా వరకు మరో ద్రోణి ఏర్పడింది. దీని కారణంగా ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం రోజు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
పోలవరం, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. ఆ సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని సూచన చేసింది.