Kuppam Accident: కుప్పం నియోజకవర్గంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన ఓ కంటైనర్ అదుపు తప్పి ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగాన్ని అదుపు చేయలేక మరో వాటర్ ట్యాంకర్ ను బలంగా ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన శాంతిపురం మండలం కడపల్లి వద్ద రహదారిపై జరిగింది.
అతివేగమే ప్రమాదానికి కారణం
రహదారిపై ఒక కంటైనర్ వాహనం అత్యంత వేగంగా వస్తూ తన నియంత్రణ కోల్పోయింది. ముందుగా బైక్పై వెళ్తున్న దంపతుల పైకి కంటైనర్ వాహనం దూసుకెళ్లింది. ఆ తర్వాత వేగాన్ని అదుపు చేయలేక, అక్కడే రోడ్డు పక్కన ఉన్న వాటర్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ద్విచక్రవాహనం నుజ్జునుజ్జవ్వగా, వాటర్ ట్యాంకర్ భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది.
ముగ్గురు అక్కడికక్కడే మృతి
ఈ దారుణ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న సుందరప్ప (60), ముని వెంకటమ్మ (50) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వాటర్ ట్యాంకర్ వద్ద నిలబడి ఉన్న నాలుగేళ్ల పసివాడు కూడా ఈ రక్కసి వాహనం కింద పడి దుర్మరణం చెందడం అందరినీ కలచివేసింది.
ఆసుపత్రిలో ఐదుగురి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నపిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను సమీపంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: టాటాసుమోపై విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి, వీడియో వైరల్!