370 Biryani Controversy: సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన ‘రూ. 370 బిర్యానీ వివాదం’పై మహారాష్ట్ర సైబర్ సెల్ కఠిన చర్యలు తీసుకుంది. ఇంటర్నెట్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, అభ్యంతరకరమైన మరియు అశ్లీల కంటెంట్ను ప్రసారం చేసినందుకు గానూ స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే, హిమాన్షు జంగ్రా, ఇతరులపై పోలీసులు FIR నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 ఐటీ చట్టం కింద ముంబైలోని నోడల్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
కమెడియన్ ప్రణిత్ మోరే నిర్వహించిన ఒక స్టాండప్ కామెడీ షో వీడియో నుండి ఈ వివాదం మొదలైంది. ఈ షోలో గురుగ్రామ్కు చెందిన హిమాన్షు జంగ్రా అనే ప్రేక్షకుడు తన డేటింగ్ అనుభవాన్ని పంచుకున్నాడు. తాను ఒక అమ్మాయితో డేట్కు వెళ్లినప్పుడు చికెన్ బిర్యానీ కోసం రూ. 370 ఖర్చు చేశానని, అందువల్ల ఆ అమ్మాయి తనతో శారీరకంగా దగ్గరవ్వాలని తాను ఆశించినట్లు చెప్పాడు. అంతటితో ఆగకుండా, ఆమెకు ఇష్టం లేకపోయినా తాను ఎలా బలవంతంగా తాకానో, ముద్దు పెట్టుకున్నానో నవ్వుతూ, గర్వంగా వివరించాడు. హోస్ట్గా ఉన్న కమెడియన్ ప్రణిత్ మోరే అతడిని వారించాల్సింది పోయి, ఆ వ్యాఖ్యలను చూసి నవ్వుతూ, ఆ క్లిప్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేశాడు.
Read also-Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!
మహిళల అంగీకారాన్ని, లైంగిక వేధింపులను హాస్యాస్పదంగా చిత్రీకరించడంపై నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం ముదరడంతో హిమాన్షును అతడు పనిచేసే కంపెనీ ఉద్యోగం నుండి తొలగించింది. ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్న మహారాష్ట్ర సైబర్ పోలీసులు, లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ఈ కంటెంట్పై BNS సెక్షన్లు 75(1)(iv), 75(3), 294, 353(2) మరియు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ప్రణిత్ మోరే, హిమాన్షు జంగ్రాతో పాటు ఈ వీడియోల వ్యాప్తికి కారణమైన డాక్టర్ సెజల్ పవార్ మరియు ఇతరులపై కూడా FIR నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.