Vijayawada: జోగి రమేష్ ఫ్యామిలీకి కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆయన ఫ్యామిలీ గురించి కోడలు మేఘన తీవ్రమైన ఆరోపణలు చేశారు. కొత్త విషయాలు బయటపెట్టారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించారు. అంతేకాదు పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక అంశాలను ప్రస్తావించారు. అసలేం జరిగింది?
జోగి రమేష్ ఫ్యామిలీపై కోడలు తీవ్ర ఆరోపణలు- మేఘన పోలీసులకు నాలుగు పేజీలతో ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. గతేడాది మే 28న జోగి రమేశ్ కొడుకు జోగి రాజీవ్తో సూర్యాపేటలో మేఘనకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన భర్త రాజీవ్ తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసినట్టు ఆరోపించారు. చివరకు అత్తమామలు కొడుక్కి సపోర్ట్ చేశారని వెల్లడించారు. పెళ్లి సమయంలో అల్లుడికి కానుకగా రూ.5 కోట్లు, 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి బహుమతులు ఇచ్చారని, అదనంగా మరో ఐదు కోట్లు, కారు.. అత్త-ఆడపడుచులకు వజ్రాల నగలు కావాలంటూ ఒత్తిడి చేశారని తెలియజేశారు. తన పేరిట ఆస్తులను భర్త పేరుతో బదలాయింపు కోసం వేధించారని, అందుకు తాను ససేమిరా అనడంతో పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు మేఘన.
తన భర్త సంసారానికి పనికిరాడు- తాను రోజు ఉదయం పూజలు చేద్దామని అగర్ బత్తీ వెలిగిస్తే శవం దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తోందంటూ అవమానించేవాళ్లని వివరాలు బయటపెట్టారు. ఆ తర్వాత వాళ్లు క్రైస్తవంలోకి మారారనే విషయం తెలిసిందన్నారు. కనీసం టెంపుల్ కు వెళ్లకుండా ఆంక్షలు విధించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. తన భర్త సంసారానికి పనికిరాడని, శారీరక లోపాన్ని దాచి పెట్టి పెళ్లి చేశారని ఆరోపించారు ఆమె. గతేడాది ఆగష్టు 26న తనను పుట్టింటికి పంపేశారని, మరణ భయంతో అంతకుముందు వరకు తాను సూర్యపేటలో ఉన్నట్లు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ దాడి జరిగిందని చెప్పడం ఓ నాటకమని వెల్లడించారు. గోవాకు తన భర్తతో వెళ్లగా అక్కడ తనను బోటులోనుంచి తోసేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు.
ALSO READ: విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు
నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ-ఎవరూ లేనిచోట తనను వదిలేసి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు మేఘన. గోవా నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చామన్నారు. నార్సింగిలోని విల్లాకు తీసుకెళ్లి తన భర్తతో పాటు మామ జోగి రమేష్, మరికొందరు తనను కొట్టి చంపాలనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. భయంతో వాళ్ల కాళ్లపై పడి ప్రాధేయపడి చెప్పినట్టే చేస్తానని అనడంతో తనను విడిచిపెట్టారని ఫిర్యాదులో పేర్కొంది మేఘన. ఆరోపణలకు సంబంధించి వీడియో, ఆడియో, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆమెని పోలీసులు కోరారు. సోమవారం సాయంత్రానికి వివరాలు ఇస్తామని మేఘన చెప్పినట్టు సమాచారం. కోడలు చేసిన ఆరోపణలపై జోగి ఫ్యామిలీ సభ్యులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయించాలని పోలీసులు ఆలోచన చేస్తున్నారు.