ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి తెరలేపారు కొంతమంది అజ్ఞాత వ్యక్తులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ను సృష్టించి, భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆలయ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో దేవస్థానం యంత్రాంగం భక్తులను అప్రమత్తం చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది.
మోసం జరుగుతోందిలా..
ప్రస్తుతం సోషల్ మీడియా మరియు గూగుల్ సెర్చ్ ఇంజిన్లలో “https://devdham.com“ అనే వెబ్సైట్ ద్వారా శ్రీకాళహస్తి ఆలయ సేవలు అందుబాటులో ఉన్నట్లు తప్పుదారి పట్టిస్తున్నారు. శ్రీస్వామి, అమ్మవార్ల దర్శన టిక్కెట్లు, ఆర్జిత సేవలు, ముఖ్యంగా దోష నివారణ కోసం చేసే రాహుకేతు పూజల టిక్కెట్లు ఈ వెబ్సైట్లో లభిస్తాయని నమ్మిస్తూ భక్తులను మోసగిస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఈ పుణ్యక్షేత్రం పేరును వాడుకుని, అమాయక భక్తుల నుంచి నగదు కాజేస్తున్నారని అధికారులు గుర్తించారు.
అధికారిక వెబ్సైట్ను మాత్రమే వాడండి
ఈ స్కామ్ వెలుగులోకి రావడంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు స్పందించారు. భక్తులు ఎవరూ ఇలాంటి మోసపూరిత లింకులను క్లిక్ చేయవద్దని కోరారు. దర్శన టిక్కెట్లు, వసతి గదుల బుకింగ్ లేదా విరాళాలు ఇవ్వాలనుకునే వారు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక దేవాలయాల పోర్టల్ https://www.aptemples.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని సూచించారు. ఇది కాకుండా ఇతర ప్రైవేట్ వెబ్సైట్లు లేదా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే లావాదేవీలకు దేవస్థానానికి ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
దళారుల పట్ల జాగ్రత్త
కేవలం ఆన్లైన్ వెబ్సైట్లు మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ప్రకటనలు చూసి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో టిక్కెట్లు ఇప్పిస్తామంటూ వచ్చే ప్రకటనలను నమ్మవద్దని, దళారుల మాటలు విని వారికి నగదు చెల్లించి మోసపోవద్దని కోరారు. ఆలయానికి సంబంధించిన ఏ సేవలనైనా అధికారిక వెబ్సైట్ లేదా ఆలయ కౌంటర్ల వద్ద మాత్రమే పొందాలని దేవస్థానం అధికారులు తమ ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు. భక్తులు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలని హెచ్చరించారు.
ALSO READ: Big TV: మీడియా అంటే ‘వైట్ ఎలిఫెంట్’ కాదు.. ప్రజా సేవకు పీఠం: విజయ్ రెడ్డి