Chintakayala Vijay: నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. సొంత పార్టీ క్యాడర్ను ఉద్దేశించి ఆయన చేసిన ఈ హెచ్చరికలు కూటమి ప్రభుత్వంలో అంతర్గతంగా ఉన్న పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి.
రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, నర్సీపట్నం నియోజకవర్గంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నాయకులతో లోపాయికారీ సంబంధాలు కొనసాగిస్తుండటంపై విజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సిగ్గు, లజ్జ లేకుండా వైసీపీ వాళ్లతో తిరిగే వారి వివరాలు సేకరిస్తున్నాను’ అని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగించే వారిపై విజయ్ అత్యంత కఠినమైన పదజాలం వాడారు. వైసీపీ నేతలతో మాట్లాడినా, వారి శుభకార్యాలకు వెళ్లినా ఊరుకోబోనని హెచ్చరిస్తూ.. ఒకవేళ పార్టీకి విరుద్ధంగా ప్రవర్తిస్తే ‘పేగులు తీసి రోడ్డు మీద పడేస్తా’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆరు సంవత్సరాలుగా క్రమశిక్షణ గురించి చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ముందున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, అప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్నవారితో కలిసిపోదామని చూసే ధోరణిని ఆయన తప్పుబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టేవారిని సహించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ‘నేను చచ్చేవరకు పార్టీలోనే ఉంటాను.. పార్టీకి ద్రోహం చేయాలని చూస్తే ఊరుకోను’ అని తన నిబద్ధతను చాటుకుంటూనే.. క్యాడర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ALSO READ: భారత సత్తా చాటేలా.. భద్రతా కోటలో 77వ గణతంత్ర వేడుకలు