Komatireddy Venkat Reddy: నేడు ఏపీకి తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి వెళ్లడం.. రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు సీఎం చంద్రబాబును ఆహ్వానించనున్నారు కోమటి రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోమటి రెడ్డి కలుస్తారా లేదా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దేశీ, విదేశీ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ పెట్టుబడిదారులు, పారిశ్రామిక సంఘాలను ఈ సమ్మిట్కు ఆహ్వానించేందుకు రాష్ట్ర మంత్రులు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏపీకి వెళ్లినట్లు సమాచారం.
ఈ పర్యటనలో కోమటిరెడ్డి తొలుత చంద్రబాబును కలిసి తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు అధికారిక ఆహ్వానం అందించనున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఐటీ ఈఎస్ఎం, మౌలిక సదుపాయాల రంగాల్లో భారీ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ సమ్మిట్కు హాజరవడం వల్ల పెట్టుబడిదారుల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఇటీవల తెలంగాణ ప్రజలపై పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోమటిరెడ్డి కలుస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read: అమరావతిలో గౌతమ్ అదానీ, సీఎం చంద్రబాబుతో భేటీ, రాత్రివేళ సమావేశం వెనుక?
ఇక మరోవైపు, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య గతంలో వివిధ అంశాలపై రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం అభివృద్ధి కేంద్రంగా ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేసే దిశగా ముందుకు సాగుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి పర్యటనను కేవలం ఒక ఆహ్వాన కార్యక్రమంగా మాత్రమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య భవిష్యత్ సంబంధాలకు దిశానిర్దేశం చేసే కీలక అడుగుగా కూడా చూస్తున్నారు.