Tirumala laddu ghee case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఎవరికివారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కొందరంటే.. మరికొందరు మాత్రం అధికారులు చూసుకున్నారని అంటున్నారు. ఇలా ఎవరికివారు ఆ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీడీ నుంచి ఎవర్ని విచారణకు పలిచినా ఇదే సమాధానాలు వస్తున్నాయి. తాజాగా సీబీఐ సిట్ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో శనివారం విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
తిరుమల కల్తీ లడ్డూ కేసు
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ విచారణ వేగం పుంజుకుంది. శనివారం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని సుమారు నాలుగు గంటల పాటు విచారించారు అధికారులు. సీబీఐ డీఐజీ మురళీ రాంబా, తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో ఈ విచారణ సాగింది.
విచారణ సందర్భంగా అధికారులు అడిగిన ఎక్కువ ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదని భూమన కరుణాకర్ రెడ్డి సమాధానమిచ్చినట్లు సమాచారం. రెండుసార్లు టీటీడీ చైర్మన్, ఓసారి ఎక్స్ అఫిషియో మెంబరుగా కొనసాగిన మీరు కల్తీ నెయ్యి గురించి ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నకు ఈ విషయం తనకు తెలీదని చెప్పారట.
సిట్ ప్రశ్నలకు భూమన షాక్
2020లో టెండర్ నిబంధనలను ఎందుకు సడలించారు? ఏఆర్ డెయిరీ నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికి ఆయన బదులిస్తూ.. టెండర్లు పిలవడం, వాటిని ఖరారు చేయడం, నాణ్యత పరీక్షలు, అధికారుల పరిధిలోని అంశాలను ఆ విషయాలను తనకు ఏమీ తెలియదని అన్నట్లు తెలుస్తోంది.
కేవలం పాలక మండలిలో అజెండాను చదువుతారని, సభ్యులంతా ఆమోదించడం సహజమని అన్నారట. నెయ్యి కల్తీ గురించి తమకు ఎలా తెలుస్తుందని సమాధానం ఇచ్చారాయన. నాణ్యత లేని నెయ్యిని తిరస్కరించడమనేది ఎప్పటి నుంచో జరుగుతోందని చెప్పారట.
ఎన్టీఆర్ సీఎంగా పనిచేసిన కాలంలో 12సార్లు, చంద్రబాబు తొలిసారి సీఎం అయిన కాలంలో 14సార్లు, వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 16 సార్లు, చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక 14 సార్లు, జగన్ ప్రభుత్వంలో 16సార్లు నాణ్యత లేని నెయ్యిని తిప్పి పంపించారని భూమన సమాధానమిచ్చినట్టు తెలిసింది.
ALSO READ: ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక.. అయోధ్యకు సీఎం చంద్రబాబు
విచారణకు హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చిన భూమన, విచారణ తర్వాత తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. కల్తీ నెయ్యి కేసులోని ఛార్జిషీట్లో నిందితులుగా ఉన్న ఉద్యోగుల ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని గతంలో టీటీడీని సిట్ అధికారులు కోరారు. అందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం డజను మంది ఉద్యోగులను ప్రాసిక్యూషన్ చేసే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా శనివారం టీటీడీ పరిపాలన భవనానికి సిట్ అధికారులు వచ్చారు. గడిచిన ఐదేళ్లలో నెయ్యి కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు క్షుణ్నంగా పరిశీలించి ఫైళ్ల వివరాలు తెలుసుకున్నారు. ఎన్ని లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేశారు? టెండర్లు ఏ విధంగా ఖరారు చేశారు? నెయ్యి సరఫరా చేసిన సంస్థలు ఏవి? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది.