ఆమె నోటికి మొక్కాలి అంటారు.. చాలా మంది ఆమె గురించి తెలిసిన వారు. ఇక తెర వెనుక ఉండి అన్ని వ్యూహాలు రచించే కొండా మురళిది మరో స్టైల్. ఈ ఇద్దరి సంతానం సుష్మిత ఇంతకు మించి అన్నట్టు.. ఆమె మాటలను చూసిన అందరూ అనుకున్నారు. సుష్మిత కామెంట్స్కు పెద్దగా మద్దతు దొరకలేదు.
ఆ కుటుంబ పెంపకం నుంచి వచ్చిన సంతానం ఇలా కాకపోతే ఎలా ఉంటుంది..? అనే చర్చ కూడా మొదలైంది. తాము చెప్పినట్టు వింటే ఓకే.. లేదంటే మీ బండారం బయటపెడతాం.. అనే సుష్మిత మాటల దోరణే ఆమెవి బ్లాక్ మెయిల్ రాజకీయాలని అంతా అర్థం చేసుకున్నారు. తమకు తాము పెద్దగా ఊహించుకోవడం ఓ తప్పైతే.. బెదిరిస్తే చాలు ఎలాంటి పనులైనా చక్కబెట్టుకోవచ్చనే దోరణి మరో తప్పుడు బాట. ఈ బాటలో ఆ కుటంబం పయనించింది కనుకే.. ఇప్పుడు ఒంటరైంది.
కొండ అద్దమందు కొంచెమై ఉండదా..? అనే వేమన శతకానికి అపోజిట్గా పోయింది కొండా ఫ్యామిలీ. తమకు తాము పెద్దగా ఊహించుకున్నారు. మురళి లేకపోతే అసలు రేవంత్ సీఎం అయ్యేవారే కాదని, మురళి కింగ్ మేకర్ అని బాహాటంగా ప్రకటించడం కూడా తమతో పెట్టుకుంటే పుట్టగతులుండవనే బెదిరింపు వ్యాఖ్యలుగానే చూడాల్సి ఉంటుంది.
అయితే కొండా సురేఖతో ప్రభుత్వం వైరం పెంచుకోదని అంతా భావించారు. కానీ సుష్మిత వ్యాఖ్యల తరువాత కూడా మురళి కుటుంబంలో మార్పు లేదు. అదే బెదిరింపు దోరణే కొనసాగింది. తన కూతురు వ్యాఖ్యలకు మాకేం సంబంధం అంటూ సాకులు వెతుక్కోవడం తప్పనిసరిగా వేటు పడాల్సిందేననే నిర్ణయానికి వచ్చేలా చేసింది. చేతులు కాలాయి అని తెలిసిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా.. వెంటనే కాళ్ల బేరానికి రావడానికి సురేఖ సిద్దమైనా.. అప్పటికే అక్కడ నిర్ణయం అనధికారికంగా ఫైనల్ అయిపోయింది.
సురేఖ ఈ విషయంలో ఒంటరే అయ్యారు. రెండు బీసీ కులాల కార్డులు పనిచేయలేదు. కనీసం బీసీ మహిళా కోటానన్న కాపాడుతుందేమోనని చూశారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు అధిష్టానం. గద్వాల విజయలక్ష్మి, గుండు సుధారాణిలకు పదవులు ఇవ్వడం మూలంగా బ్యాలెన్స్ చేయాలని చూశారు. కానీ విజయలక్ష్మికి పదవి ఇవ్వడాన్ని ఎవరూ హర్షించలేదు. పైగా కేకే మధ్యవర్తిత్వంపై ఏవగింపు వ్యక్తమయ్యింది. మున్నూరుకాపు కోటాలో ఆమెను భర్తీ చేశామని ప్రభుత్వం చెప్పుకున్నా.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు.
కానీ ఇక్కడ కొండా ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ప్రభుత్వంపై ఈ బర్తరఫ్ ఎఫెక్ట్ పడలేదని తెలుస్తోంది. బీసీల సానుభూతి దొరకకపోగా.. ఉల్టా బీసీల నుంచే ఆమె సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ బస్సరాజు సారయ్య ఆమెను టార్గెట్ చేశారు. రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని సవాల్ విసరడం.. మీ సత్తా ఏందో తేలిపోతుంది రండి అని కవ్వింపు చర్యలకు దిగినట్టేనని భావిస్తున్నారు.