Tirumala: సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో కొందరు పుణ్యక్షేత్రాల్లోనూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తిరుమల, శ్రీశైలంలో కొందరు భక్తుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
తిరుమలలో రాజకీయ ప్రకటనలపై టీటీడీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అలాగే ఎలాంటి రాజకీయ ప్రచారాలు, ఫొటోలు ప్రదర్శించిన చర్యలు తీసుకుంటారు. అయితే తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమల ఆలయం ముందు అన్నాడీఎంకే పోస్టర్లను ప్రదర్శిస్తూ వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తిరుమలలో రాజకీయ ప్రచారం చేసిన తమిళనాడు భక్తులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది.
కొందరు భక్తులు రాజకీయ నేతల ఫొటోలతో బ్యానర్ను ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా భక్తులు వ్యవహరించినట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ తెలిపింది. ఆ బ్యానర్ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పేర్కొంది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు.
తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం
శ్రీవారి ఆలయం వద్ద తమిళనాడు యువకుల హల్ చల్
నిబంధనలకు విరుద్ధంగా జయలలిత, పళని స్వామి ఫొటోలతో హల్ చల్ @TTDevasthanams pic.twitter.com/y4XzJkkT7p
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2025
శ్రీశైలానికి దర్శనార్థం వచ్చిన ఓ యువతి రీల్స్ చేయడం వివాదాస్పదం అయింది. శ్రీశైలంలోని సీఆర్ఓ ఆఫీస్ సమీపంలో ప్రధాన రహదారిపై సినిమా సాంగ్స్ డ్యాన్స్ చేస్తూ యువతి రీల్స్ చేసింది. ఈ వీడియోలు తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవిత్రమైన ఆలయాల్లో ఇలాంటి పిచ్చి చేష్టలు ఏంటని మండిపడుతున్నారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ చేసిన యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమల తరహాలో శ్రీశైలంలో కూడా రీల్స్, వీడియోలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. శ్రీశైలం ఆలయ ఛైర్మన్, ఈవో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతున్నారు.