Christmas dinner: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న అధికారిక క్రిస్మస్ డిన్నర్ ఏర్పాట్లపై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు లేకుండా.. అత్యుత్తమ ప్రమాణాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ లౌకిక దృక్పథానికి, మత సామరస్యానికి ఈ కార్యక్రమం నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. సుమారు 10,000 మంది క్రైస్తవ ప్రముఖులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు డిసెంబర్ 18న అధికారుల బృందం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించనుంది. శాంతియుత వాతావరణంలో.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ వేడుకను ఒక పండగలా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా భక్తులు, అతిథుల కోసం తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, మరుగుదొడ్లు, అలంకరణలో ఎటువంటి రాజీ పడకూడదని మంత్రి అధికారులకు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పరమైన చర్యలు, అగ్నిమాపక సేవలు, అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఆహార నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆహార భద్రతా అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. షఫియుల్లా, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ, క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ సబిత, జలమండలి డైరెక్టర్ మయాంక్ మిట్టల్ పాల్గొన్నారు. వీరితో పాటు పోలీస్, ట్రాఫిక్, జిహెచ్ఎంసి (GHMC), విద్యుత్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల ప్రతినిధులు హాజరై తమ విధులను సమన్వయం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా మత సామరస్యానికి ప్రతీకగా ఈ వేడుక ఘనంగా జరగాలని మంత్రి ఆకాంక్షించారు.