Tirumala News: తిరుమల కలియుగ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అయినా దర్శనానికి టికెట్లు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు శ్రీవాణి టికెట్లు తీసుకుని దర్శనం చేస్తుంటారు. టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది.
శ్రీవాణి టికెట్ల వ్యవహారం.. ఓ ట్రావెల్ ఏజెన్సీ అక్రమ దందా
తిరుమలలో దర్శనం టికెట్ల వ్యవహారంలో ట్రావెల్ ఏజెన్సీలు భక్తులు మోసం చేసే ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా దాదాపు 800 శ్రీవాణి టికెట్ల జారీ చేస్తున్నారు అధికారులు. ఆయా టికెట్ల బుకింగ్లో ప్రైవేట్ నెట్ సెంటర్లు, ట్రావెల్స్ ఏజెంట్లు అధికభాగం. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను ఉపయోగించి టికెట్లను తీసుకుంటున్నారు.
బయట ఒక్కో టికెట్ మూడు వేలకు పైగానే అమ్ముతున్నారు. వెబ్సైట్లో టికెట్లు అప్లోడ్ అవ్వగుండానే కొత్త సాఫ్ట్వేర్ ద్వారా సమాచారాన్ని సర్వర్లోకి పంపుతున్నారు. భక్తుల ఆధార్ వివరాలు ముందుగానే వారు సేకరించి సాఫ్ట్వేర్లో ఉంచుతున్నారు. సామాన్య భక్తుల కంటే వేగంగా బుకింగ్ చేస్తున్నారు. గతంలో ఈ విధంగా టికెట్లు ఇలాగే పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.
సాఫ్ట్వేర్తో ఆ పని కానిచ్చేశారు..ఒక్కో టికెట్ మూడు వేల పైమాటే
దీని వెనుక ఐటీ విభాగంలోని కొందరి అంతర్గత సహకారం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దర్యాప్తు అధికారులు. దీన్ని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మే నెల ఆరున చెన్నైకి చెందిన ఇద్దరు భక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీవాణి టికెట్ల దందా వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్స్ శ్రీవాణి టికెట్ల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఒక్కో టికెట్పై భక్తుల నుంచి అదనంగా రూ.3,000 గుంజుకుంటున్నారు. ఫిర్యాదు చేసిన మరుసటి రోజు తిరుమల వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. చెన్నైతోపాటు వివిధ ప్రాంతాల్లో వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాదు ట్రావెల్స్ వెబ్సైట్ను బ్లాక్లిస్ట్లో పెట్టారు అధికారులు. టికెట్ బుక్ చేసినప్పుడు భక్తుల ఫొటో తీస్తే బాగుంటుందని అంటున్నారు.
దీనివల్ల దర్శనం వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తే ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై టీటీడీ వీజీవో రియాక్ట్ అయ్యారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని, శ్రీవాణి టికెట్లు బల్క్గా బుక్ చేసే సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నట్లు చెప్పారు. భక్తులను మోసగించే ట్రావెల్స్ ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.