Tirumala News: భక్తులకు పుణ్యక్షేత్రం తిరుమల. నార్మల్గా స్వామి దర్శనాలకు భక్తులు ఎగబడతారు. అలాంటిది వైకుంఠ ద్వార దర్శనం అంటే చెప్పనక్కర్లేదు. ఆ రోజు స్వామిని దర్శించుకుంటే చేసిన పాపాలు కొంతైనా తొలగతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తుల ఎగబడతారు.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వేగంగా ఏర్పాట్లు
తాజాగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. వైకుంఠ ఏకాదశి మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా 1.76 లక్షల టోకెన్లను జారీ చేసింది. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది.
తిరుమలలో స్వామి వైకుంఠ ద్వారా దర్శనానికి తొలి మూడు రోజులు టోకెన్ల కోసం 24,05,237 మంది భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ-డిప్ ద్వారా కేవలం 1.76 లక్షల టోకెన్లు జారీ చేసింది టీటీడీ. డిసెంబర్ 30న అంటే వైకుంఠ ఏకాదశి రోజు 8,71,340 భక్తులు రిజిస్ట్రేషన్ రాగా.. ఈ-డిప్ ద్వారా 57 వేల మంది భక్తులకు టోకెన్లు కేటాయించింది.
ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ, భక్తుల ఫోన్లకు మెసేజ్లు
డిసెంబర్ 31న అంటే ద్వాదశి రోజు 8,52,404 భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వారికి ఈ-డిప్ ద్వారా 64 వేల మంది భక్తులకు టోకెన్లు జారీ చేసింది. ఇక జనవరి 1న 8,48,367 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో కేవలం 55 వేల మందికి టోకెన్లు కేటాయించింది.
వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి మూడు రోజులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఈ రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా అన్నిరకాల సిఫార్సు దర్శనాలు రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి రోజు కేవలం 70 వేల మందికి దర్శనాల కోసం ఏర్పాట్లు చేసింది. ఆ లెక్కన గంటకు 4300 మందికి దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.
ALSO READ: సీఎం చంద్రబాబుకు షాక్.. ఆ ఎమ్మెల్యే గుడ్ బై
డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి రోజు 20 గంటల దర్శన సమయంలో 4.45 గంటలు వీఐపీలకు, 15.15 గంటలు సామాన్య భక్తులకు సమయం కేటాయించింది. డిసెంబర్ 31 రోజు 19 గంటల దర్శన సమయంలో 2.15 గంటలు వీఐపీలకు, 16.45 గంటలు సామాన్య భక్తులకు కేటాయించింది.
జనవరి 1 న 68 వేల మందికి దర్శన ఏర్పాట్లు చేసింది టీటీడీ. అందులో 17.30 గంటల సమయంలో కేవలం 2.15 గంటలు వీఐపీలకు, 15.15 గంటలు సామాన్య భక్తులు దర్శనం చేసుకోనున్నారు. టికెట్ల కేటాయింపుతో పాటు దర్శనానికి వెళ్ళే మార్గం కూడా గూగుల్ మ్యాప్ను భక్తులకు పంపనుంది టీటీడీ.