Tomato Rates Collapsed: కూరగాయల రారాజు టమోటా ధరల భారీగా పతనం అయ్యాయి. ఏపీలోని పలు జిల్లాల్లో టమోటా రైతులకు తీవ్ర నష్టం మిగిలింది. కేజీ టమోటా ధర రెండు రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లి, అనంతపురం రైతులు.. టమోటాలను రోడ్లపైనే పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధరలు బాగా పడిపోవడంతో టమోటా రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం సాగు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రోడ్లపైనే పారబోస్తున్నారు.
అనంతపురం జిల్లా కక్కలపల్లి మార్కెట్ యార్డ్లో.. టమోటా ధర కిలోకు రూ.10 నుంచి రూ.2 లకు పడిపోయింది. దీంతో రైతులు తమ లోడ్ లను యార్డ్లోనే పెద్ద మొత్తంలో వదిలేసి వెళ్తున్నారు. సాధారణంగా పీక్ సీజన్లో మార్కెట్ కు లక్ష నుంచి రెండు లక్షల టమోటా బాక్స్ లు డిమాండ్ ఉండేది. ఇప్పుడు రోజుకు దాదాపు 20,000 పెట్టెలు మించి ఆర్డర్లు రావడంలేదు. 12 నుంచి 24 కిలోల బరువున్న ప్రతి పెట్టె ధర ప్రస్తుతం రూ.30 నుంటి రూ.60 మధ్య పలుకుతుంది. కూలీ ఛార్జీలు, రవాణా ఖర్చులు, కమీషన్ చెల్లింపులు పోను చేతికి చిల్లిగవ్వ కూడా రావడంలేదని రైతులు చెబుతున్నారు. దీంతో చాలా మంది రైతులు పంటకోత నిలిపివేశారు. ఇటీవలి మార్కెట్ యార్డ్కు రోజుకు 500 నుండి 800 టన్నుల టమోటాలు వస్తున్నాయి. ధరలు పడిపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురావడానికి ఇష్టపడటం లేదు.
Also Read: ప్రోటీన్ కోసం నాన్ వెజ్ అక్కర్లేదు.. ఈ 7 ఆకుకూరలు చాలు!
చాలా మంది రైతులు పంటను కోయకుండా పొలాల్లో వదిలేస్తున్నారు. రబీ పంట చివరి దశలో ఉండడం, నాణ్యత తగ్గడంతో ధరల తగ్గుదలకు కారణమైందని శ్రీ సత్యసాయి జిల్లా ఉద్యానవన అధికారి జి.చంద్రశేఖర్ తెలిపారు. కిలోకు రూ.5 చొప్పున టమోటాలు సేకరించి కొన్ని జిల్లాలకు సరఫరా చేస్తున్నామన్నారు. అయితే, ఎగుమతిదారులు అనంతపురం జిల్లా నుండి టమోటాలు కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదన్నారు. కళ్యాణదుర్గం మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన రైతు కె. హనుమంత రాయుడు మాట్లాడుతూ.. దాదాపు రూ.8 నుంచి రూ.10 లక్షల పెట్టుబడి పెట్టి 15 ఎకరాల్లో టమోటాలు పండించానని వాపోయారు. ఎగుమతులు నిలిచిపోవడం, స్థానిక డిమాండ్ లేకపోవడంతో జిల్లాలో టమోటా వ్యాపారం దాదాపు నిలిచిపోయిందన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.