Anakapalli in Tremors: ఏపీలో తరచూ భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న పర్యాటక ప్రాంతం అరకు, పాడేరు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా వంతైంది. భూప్రకంపనల ధాటికి అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు రావడం తీవ్ర కలకలం రేపింది.
ఏపీలో చీటికి మాటికీ భూప్రకంపనలు
ఏపీలో భూప్రకంపనలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. లేటెస్ట్గా గురువారం రాత్రి అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాంబిల్లి మండలం పరిసరాల్లో ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
వీటి తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదు అయ్యింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సమ్మర్ కావడంతో ఉక్కుపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆ సమయానికి ఇంకా నిద్రపోలేదు. సడన్గా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో హడలిపోయారు. ఆపై రోడ్ల మీదకు పరుగులు తీశారు. మళ్లీ భూప్రకంపనలు వస్తాయోనన్న భయంతో బెంబేలెత్తిపోయారు.
అనకాపల్లి జిల్లాలో వణికిన భూమి.. అర్ధరాత్రి రోడ్లపైకి ప్రజలు
ముఖ్యంగా రాంబిల్లి మండలం తీర ప్రాంతానికి దగ్గరలో ప్రకంపనల వచ్చినట్టు కనిపించింది. ఇళ్లలో సామాన్లు కిందపడటం కనిపించింది. వీటి వల్ల ఎలాంటి ప్రాణ-ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ పరిస్థితులను జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఎందుకైనా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు అధికారులు.
రెండు వారాల కిందట అల్లూరి జిల్లాలో రాత్రి 11 గంటల సమయంలో ఇలాంటి ప్రకంపనలు వచ్చాయి. టూరిజం ప్రాంతమైన అరకు, పాడేరులోని పలు ప్రాంతాల్లో వరుసగా భూమి వణికించింది. ఉన్నట్లుండి ఈ విధంగా తాము ఎప్పుడూ చూడలేదని స్థానిక ప్రజలు చెప్పారు. అంతకుముందు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే.
ALSO READ: ఏపీకి మరొక భారీ పెట్టుబడి.. 300 ఎకరాల్లో పరిశ్రమ, రూ.8,175 కోట్ల పెట్టుబడి