Tirumala News: తిరుమల తిరుపతి దేవస్థానం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. అంతేకాదు బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ సహా ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తిరుమలలో ఈసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు-తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఒక్కసారి నిర్వహిస్తుంటారు. ఈసారి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది టీటీడీ. అధికమాసం కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవం నిర్వహించనుంది. ఇది సెప్టెంబర్ మాసంలో జరగనుంది. ఇక దసరాకు అక్టోబర్ నెలలో మరోసారి బ్రహోత్సవాలు ఉంటాయి.
హిందూ చాంద్రమాన క్యాలెండర్ మేరకు.. ప్రతి 32 నెలలకొకసారి అధిక మాసం వస్తుంది. ఆ కారణంగా రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈసారి సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దసరాకు అక్టోబర్ 11 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
అధిక మాసం కారణంగా సెప్టెంబరులో బ్రహ్మోత్సవాలు- వరుసగా బ్రహ్మోత్సవాలు రావడంతో ఇప్పటి నుంచి ఏర్పాట్లలో నిమగ్నమైంది టీటీడీ. సెప్టెంబర్లో నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష చేపట్టారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమయంలో వీఐపీ బ్రేక్ సహా అన్నిరకాల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులు, ఎన్ఆర్ఐ, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. కేవలం ప్రొటోకాల్ దర్శనాలకు అనుమతి ఉంటుందన్నారు.
అన్ని రకాల వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న కారణంగా సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టనుంది.ముఖ్యంగా మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు. విద్యుద్దీపాలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకునేలా ఉండాలన్నారు.
ఈ సమయంలో స్వామి సేవకులుగా యువతీ-యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలుత సెప్టెంబర్ 8న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. సెప్టెంబర్ 14న స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శ్రీకారం చుట్టనున్నారు.
ALSO READ: ముంబైకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శనివారం ఆపరేషన్
15న ధ్వజారోహణం, 19న గరుడవాహనంపై స్వామివారు ఊరేగుతారు. 22న రథోత్సవం, 23న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా సెప్టెంబర్ 18-20 వరకు కొండపైకి టూ వీలర్లకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశించారు. గరుడసేవకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో తగిన విధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని సూచించారు.