Guntakal Burglary: అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ రైల్వే మహిళా ఉద్యోగిని విధులకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు.. ఆమె ఇంట్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడటమే కాకుండా, ఇంట్లోని వస్తువులను తగలబెట్టి వికృత చేష్టలకు ఒడిగట్టారు.
విధులకు వెళ్లగా.. ఊడ్చేశారు!
గుంతకల్లులోని కోయినగర్ లో ఉమాదేవి అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె స్థానిక రైల్వే స్టేషన్ లో పాయింట్ మెన్ గా ఉద్యోగం చేస్తోంది. ఎప్పటిలాగే బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె తన నైట్ డ్యూటీ కోసం ఇంటికి తాళం వేసి స్టేషన్కు వెళ్లిపోయింది. ఒంటరిగా ఉండే ఆమె ఇంట్లో లేని సమయాన్ని దొంగలు కరెక్ట్గా స్కెచ్ వేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నైపుణ్యంతో ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
నగదుతో పాటు వెండి, బంగారం మాయం
అల్మారాలను ధ్వంసం చేసిన దుండగులు.. అందులో దాచి ఉంచిన సుమారు ‘30 తులాల బంగారం,50 తులాల వెండి వస్తువులు, రూ. 20 వేల నగదును దోచుకెళ్లారు. అంతటితో ఆగకుండా, వెళ్తూ వెళ్తూ ఇంట్లోని బట్టలు, ఇతర వస్తువులను నిప్పు పెట్టి కాల్చేసి పరారయ్యారు.
Also Read: పునాది వేసింది కాంగ్రెస్.. ముద్ర వేసింది బీజేపీ.. ‘తాడిచర్ల-2’ క్రెడిట్ ఎవరిది?
ఘటనా స్థలానికి పోలీసులు
గురువారం ఉదయం విధులను ముగించుకుని ఉమాదేవి ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఇల్లంతా చెల్లాచెదురుగా మారి, సామాగ్రి కాలి బూడిదై ఉండటం చూసి ఆమె షాక్కు గురైంది. దొంగతనంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్ సహాయంతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.