కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త వినిపించింది. 2026 మే నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు, ఆర్జిత సేవల కోటాను విడుదల చేసే షెడ్యూల్ను అధికారులు వెల్లడించారు. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ ప్రయాణాన్ని ముందస్తుగా ప్లాన్ చేసుకునేలా టీటీడీ ఈ వివరాలను అందుబాటులోకి తెచ్చింది.
ఆర్జిత సేవలు – లక్కీ డిప్ ప్రక్రియ..
శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి అత్యంత విశిష్టమైన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ టికెట్ల కోసం భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) పద్ధతిలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత రుసుము చెల్లించి తమ టికెట్లను ఖరారు చేసుకోవాలి.
ఇతర సేవా టికెట్ల వివరాలు ఇవే..
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు నేరుగా బుక్ చేసుకునేలా విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను కూడా అధికారులు విడుదల చేయనున్నారు.
అంగప్రదక్షిణ, శ్రీవాణి ప్రత్యేక కోటాలు..
మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. అలాగే.. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి కోసం ప్రత్యేక ఉచిత దర్శన టోకెన్లను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కేటాయింపు..
అత్యధికంగా భక్తులు ఎదురుచూసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. దర్శనంతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ కోటాను అదే రోజు (ఫిబ్రవరి 24) మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు.
శ్రీవారి సేవ కోటా..
ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ టికెట్లను బుక్ చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.