Hyderabad: హైదరాబాద్లోని చైతన్యపురి ప్రధాన రహదారిపై త్వరలో ప్రారంభం కావాల్సిన ‘వైశ్యరాజు జ్యువెలర్స్’ షోరూమ్లో విషాదం చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా అదే భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్న చామల ముత్తయ్య (47) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం ఉదయం షాపు లోపల ఆయన మృతదేహం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యుల ఆరోపణలు..
ముత్తయ్య మరణం వెనుక పెను కుట్ర దాగి ఉందని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని, పథకం ప్రకారం జరిగిన హత్య అని వారు వాపోతున్నారు. ముఖ్యంగా, బంగారం షాపు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన తరుణంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. భవన యజమానులు లేదా షాపు నిర్వాహకులు తమ వ్యాపార లాభాల కోసం, క్షుద్ర పూజల నమ్మకంతో ‘నరబలి’ ఇచ్చి ఉంటారని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
న్యాయం కోసం ఆందోళన..
ముత్తయ్య మృతితో ఆయన కుటుంబం రోడ్డున పడింది. తన తండ్రిని అన్యాయంగా చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆయన కుమార్తె కన్నీరుమున్నీరవుతోంది. “మా నాన్నకు ఎవరితోనూ గొడవలు లేవు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం షాపు మంచిగా నడవాలనే ఉద్దేశంతోనే ఆయన్ని బలి ఇచ్చారు” అని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారు షాపు ముందు ఆందోళనకు దిగారు.
Also Read: అమ్మమ్మ ఊరు వెళ్లిన చిన్నారి.. అనంతలోకాలకు పయనమయ్యాడు.. ఒక్క షాక్ ఆ కుటుంబంలో నింపిన చీకటి!
పోలీసుల దర్యాప్తు..
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సిసిటివి ఫుటేజీని సేకరించి, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నరబలి కోణంలో వస్తున్న ఆరోపణలపై కూడా క్షుణ్ణంగా విచారణ జరుపుతామని, ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.