Ugadi Celebrations: కూటమి ప్రభుత్వం యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు సీఎం చంద్రబాబు. వారిని దృష్టిలో పెట్టుకొని ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. ఇకపై ప్రతి ఏటా ఉగాది సందర్బంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు.
విజయవాడలో ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు
తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
పచ్చడిలో పులుపు, తీపి, వగరు, చేదు, కారం వంటి రుచులు ఉంటాయన్నారు. జీవితంలో కష్టాలు, సుఖాలు అన్నీ కలిసి ఉంటాయన్నారు. ఈ ఏడాది అన్నివిధాలుగా బాగుంటుందని పంచాగ శ్రవణంలో చెప్పారని అన్నారు. ఇది వాస్తవం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలకే కాకుండా వివిధ రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు.
ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల-సీఎం
ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ అని అన్నారు. ఇక్కడి నుంచి పండుగలు ప్రారంభం అవుతుందన్నారు. ఈ ఏడాది 38 మందికి కళారత్న అవార్డులు, 122 మందికి ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని అన్నారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు సీఎం చంద్రబాబు.
కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వలు ఉన్నాయని, మే 15 నుంచి సాగుకు నీరు విడుదల చేస్తామన్నారు. జనాభా పెరుగుదల గురించి మాట్లాడారు. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుడితే ఆ రోజు వారి అకౌంట్లో వేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేస్తామని తెలిపారు. నదుల అనుసంధానం జరగాల్సిందేనని తేల్చిచెప్పారు.
ALSO READ: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభం
ఉగాది పర్వదినం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. పేదలకు ఆర్థిక సాయం అందించే సీఎం సహాయ నిధి ఫైల్పై సంతకం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 6,787 మందికి సాయం కింద రూ.55.63 కోట్లను విడుదల చేశారు. మొత్తం లక్షా 36 వేల 240 మందికి రూ.1241 కోట్ల మేరా వైద్య సాయం అందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.